పనిగట్టుకుని రైతులను తప్పదోవ పట్టిస్తున్నారు 

వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు  కేంద్ర ప్రభుత్వం  కొత్త చట్టాలను తీసుకువస్తే కొందరు మాత్రం పనిగట్టుకుని రైతులను తప్పదోవ పట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 

ప్రతిపక్షాలు రైతుల భుజాల పైనుంచి ప్రభుత్వానికి తుపాకీ గురిపెట్టాయని, అయితే దేశంలోని అవగాహన ఉన్న రైతులు వారికి సమాధానం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. 

కచ్‌ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో ఉన్న  సిక్‌ సాగుదారులతో పాటు వ్యవసాయ సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. అలాగే, సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి పార్క్, డీశాలినేషన్ ప్లాంట్, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ ఉన్నాయి.  

 ‘ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాలకు అనుకూలంగా వ్యవహరించాయి. వాళ్లు పవర్‌‌లో ఉన్నప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దేశం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సమయంలో వీళ్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అంటూ ప్రధాని  ప్రతిపక్షాలపై మండిపడ్డారు.   

గుజరాత్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధించిందని, భారత జీడీపీకి పశుసంవర్ధకం 25 శాతం తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇది పప్పుధాన్యాల సహకారం కంటే ఎక్కువ అని మోదీ తెలిపారు. 

గుజరాత్ రైతు స్వేచ్ఛా మార్కెట్‌ను ఒకవైపు రైతులు సద్వినియోగం చేసుకుంటుండగా,దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ వ్యవస్థను పొందాలని కోరుకుంటున్నారని చెప్పారు. రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం 24 గంటలు సిద్ధంగా ఉన్నదని మోదీ భరోసా ఇచ్చారు.