మానవ అభివృద్ధి సూచిలో 131వ స్థానంకు భారత్   

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) నివేదిక ప్రకారం మానవ అభివృద్ధి సూచి (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)లో భారత్‌ స్థానం 131కి పడిపోయింది. గతేడాది 130 స్థానంలో ఉండేది. 
 
మొత్తం 189 దేశాలకు గాను భారత్‌ ర్యాంక్‌ 131కి చేరింది. దేశ సగటు తలసరి ఆదాయం, విద్య, ఆయుర్దాయాలను హెచ్‌డిఐ ప్రామాణికంగా తీసుకుని ఈ నివేదికను రూపొందిస్తుంది. పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతున్న అంశాలను కూడా సూచిక పరిగణలోకి తీసుకుంటుంది. 
 
ఏడాదికేడాది దేశవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలలో పెరుగుదల ప్రాతిపదికన హెచ్‌డిఐ ఈ నివేదికను ప్రకటించింది. 
 
కాగా, నార్వే, ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. హాంకాంగ్‌ నాల్గవ స్థానంలో ఉండగా, ఐస్‌లాండ్‌, జర్మనీలు ఐదు, ఆరు ర్యాంక్‌లను సాధించాయి. 
 
ఈ నివేదికలో చైనా 85వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌ 154వ స్థానంలో ఉంది. మానవ అభివృద్థితో పాటు పర్యావరణంపై మానవుల ప్రభావాన్ని థీమ్‌గా ఎంచుకుని ఈ నివేదికను రూపొందించింది.