బెంగాల్ లో కేంద్ర బలగాలను ఇప్పటి నుంచే మోహరించాలి 

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస, భీభత్సాన్ని నియంత్రించేందుకు కేంద్ర బలగాలను ఇప్పటి నుంచే మోహరించాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ను కోరతామని రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా తెలిపారు. 
 
బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం మరింతగా ముదురుతున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల పర్యటించిన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.
కొన్ని నెలలుగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అలాగే పలువురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పూర్బా బర్ధామన్‌లోని పుర్బస్తాలి ప్రాంతంలో ఆదివారం ఒక బీజేపీ కార్యకర్త చనిపోయాడు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో బెంగాల్‌లో ఇప్పటి నుంచే కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని కోరతామని రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా మీడియాతో అన్నారు.   
 
కాగా, పశ్చిమబెంగాల్‌లో త్వరలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలవుతుందని కైలాష్ విజయ్ వర్గీయ వెల్లడించాయిరు. దీని అమలుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ ఇది అమలు అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుకు సహకరిస్తే బాగుంటుందని హితవు చెప్పరు.