దేశ వ్యాప్తంగా పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లు   

కొన్ని రోజుల్లో జనానికి  ఉచిత వైఫై అందుబాటు లోకి రానుంది. ‘పీఎం వాణి’ అనే కొత్త పధకం ​కింద కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల​లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఎలాంటి లైసెన్స్​లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే ఈ సౌకర్యం కల్పించనుంది. ఈజ్​ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లు రానున్నాయి. పబ్లిక్‌ డాటా ఆఫీస్‌ల (పీడీవో) ద్వారా వైఫై సదుపాయం కల్పించే పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 

పబ్లిక్‌ వైఫై అందించేందుకు ఏర్పాటయ్యే పీడీవోలకు ఎటువంటి లైసెన్సు, ఫీజు లేదా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. ఈ పథకాన్ని పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌ (పీఎం-వాణి)గా కేంద్రం వ్యవహరిస్తున్నది. ఈ నెట్‌వర్క్‌ల నిర్మాణం మూడు అంచెలుగా ఉంటుంది. 

పబ్లిక్​ డేటా ఆఫీస్(పీడీవో), పబ్లిక్​ డేటా ఆఫీస్​అగ్రిగేటర్స్(పీడీవోఏ), యాప్​ ప్రొవైడర్లను ఏర్పాటు చేయనుంది. వైఫై యాక్సెస్​ పాయింట్లను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, ఆపరేషన్లను పీడీవోలు చూస్తాయి. జనాలకు నెట్​ సర్వీసులను అందిస్తాయి. పీడీవోలకు మధ్యవర్తులుగా పీడీవోఏలు పనిచేస్తాయి. ఆథరైజేషన్​, అకౌంటింగ్​ వంటి వ్యవహారాలను చూస్తాయి. జనాలు నెట్​ సౌకర్యం పొందేలా యాప్​లను డెవలప్​ చేయడం, వైఫై హాట్​స్పాట్స్​ను గుర్తించడం వంటి పనులను యాప్​ప్రొవైడర్లు చూసుకుంటారు.

‘చిన్న దుకాణాలు లేదా ఉమ్మడి సేవా కేంద్రాలు కూడా పీడీవోలుగా వ్యవహరించవచ్చు’ అని కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.  పీడీవోలకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేకపోయినప్పటికీ  పీడీవోఏలు, యాప్‌ ప్రొవైడర్లు మాత్రం టెలికాం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దీనికి కూడా ఎటువంటి ఫీజు ఉండదు.