ఏపీ అసెంబ్లీలో దూషణలు, సస్పెన్షన్లు, వాకౌట్లు

సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల పరస్పర దూషణలు సస్పెన్షన్లు, వాకౌట్లతో జరుగుతున్నాయి. శాసనసభలో ప్రతితో పక్ష నేత చంద్రబాబునాయుడు మినహా మిగిలిన తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్‌ ఒకరోజు పాటు మంగళవారం సస్పెండ్‌ చేశారు. సోమవారం కూడా టిడిపి సభ్యులు అందరిని సస్పెండ్ చేశారు. 
 
రెండో రోజున ఇళ్లస్థలాల పంపిణీపై చర్చ జరుగుతున్న సమయంలో టిడిపి సభ్యులు స్పీకర్‌ పోడియం ముందుకు వెళ్లారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో వారిని సభ నుండి సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రిపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 
 
అంతకుముందు తాము ఇచ్చిన తీర్మానంపై చర్చకు అనుమతించాలని తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత నిమ్మల రామానాయుడు కోరారు. దీనికి అంగీకరించకపోవడంతో పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. సీటు వద్దకు వెళ్లాలని అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన వెనక్కి వెళ్లలేదు, దీంతో ఆయన్ను ఒకరోజు సభ నుండి సస్పెండ్‌ చేశారు. 
 
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మామ, తండ్రి చావుకు కారణం అయ్యారని, అటువంటి ఉచ్చం, నీచం లేని వ్యక్తి మరొకరు ఉండరని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో టిడిపి సభ్యులు రామకృష్ణబాబు జోక్యం చేసుకుని గతంలో వైఎస్‌.రాజశేఖరరెడ్డిని జగనే చంపించాడని సభలో మాట్లాడారని అప్పుడు ఉచ్చం, నీచం ఏమైందని ప్రశ్నించారు. 
 
దీంతో ఎవరి జాతకాలు ఏమిటో అందరికీ తెలుసని బొత్స దుయ్యబట్టారు. మంత్రులు 
అనిల్యా అనిల్ కుమార్ యాదవ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మీడియాలో మైలేజీ కోసం స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారంలో నుండి దిగిపోయే నాటికి చంద్రబాబు బకాయి పెట్టని డిపార్టుమెంటు లేదని బుగ్గన్న గుర్తు చేశారు.
శాసనమండలిలోనూ వ్యవసాయం దండగ అన్న మంత్రుల వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టిడిపి సభ్యులు పట్టుబట్టడంతో అక్కడా గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్‌ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టిడిపి సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్‌ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. 
 
పరస్పర దూషణలకు దిగారు. ఇదే సమయంలో టిడిపి సభ్యులు ఛైర్మన్‌ పోడియం ముందు చేరి మంత్రి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. సభ ఆర్డర్లో లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. అరుపులు, కేకల మధ్య ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.