అర్చకులపై చెర్నకోలతో వైసీపీ నేతల దాడి

ఆలయంలో పూజలు చేసుకునే అర్చకులను వైసీపీ నాయకులు చావబాదారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు అర్చకులు గాయపడ్డారు. 

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి ఓవైపు భక్తుల దర్శనం కొనసాగుతోంది. రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు టికెట్లు ఇవ్వొద్దని అటెండర్‌ ఈశ్వరయ్యకు అర్చకులు చెప్పారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈశ్వరయ్యను అర్చకుడు చక్రపాణి పక్కకు తోసేశారు. దీంతో తనపై అర్చకులు దాడి చేశారంటూ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఈవో మోహన్‌లకు ఈశ్వరయ్య ఫిర్యాదు చేశాడు. అంతే ప్రతాపరెడ్డి, అతని సోదరుడు రామకృష్ణారెడ్డి, అటెండర్‌ ఈశ్వరయ్య, నాగరాజు, రామకృష్ణ అక్కడికి చేరుకుని సుధాకర శర్మ, మృగఫణిపై దాడి చేశారు.

చెర్నాకోల, కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. చేతులతో కొడుతూ విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశారు. సుధాకరశర్మ ముఖంపైన, మృగఫణి శర్మ వీపుపైనా గాయాలయ్యాయి. అర్చకుల ఫిర్యాదు మేరకు చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఆలయ సిబ్బంది ఈశ్వరయ్య, నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు.

కాగా, ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

బండిఅత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో దారుణంగా ఆలయ పూజారులను చితకబాదిన ఆలయ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి వంటనే తొలగించాలని అర్చక సమాఖ్య ప్రధానకార్యదర్శి ఆగ్నిహోత్రం ఆత్రేయ బాబు కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు ముఖ్యమంత్రి, దేవాదాయధర్మాదాయశాఖా మంత్రికి, ఉన్నతాధికారులుకు విజ్ఞప్తిచేశారు. 

అర్చకులపై దాడికి ఖండిస్తూనామాని వెంటనే చర్యలుతీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వంశపారంపర్యంగా అర్చక వీధులు నిర్వవ్యాహిస్తు ప్రతి సంవత్సరంలాగే కార్తీకపౌర్ణమి రోజున కొంత సమయం ఉచిత దర్శనం ఉంటుందని వారు తెలిపారు.