పోలింగ్ శాతం తక్కువకు టీఆర్ఎస్ కుట్ర 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్సే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, ఇతర మంత్రులు తప్పుడు ప్రకటనలతో  ప్రజలను భయపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. 
 
టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని చెబుతూ  ‘‘మతాన్ని బూచీగా చూపి తప్పుడు ప్రచారం చేశారు. మతకలహాలు జరుగుతాయంటూ ప్రజలను భయపెట్టారు. టీఆర్‌ఎస్‌ తరపున పోలీస్ అధికారులే డబ్బులు పంచారు. అనుకూలమైన ఉద్యోగులకే ఎన్నికల డ్యూటీ వేశారు” అంటూ విమర్శించారు. 
 
అడ్డదారి..అక్రమ పద్ధతిలో గెలిచేప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేయర్ గెలవబోతోందని సంజయ్  ధీమా వ్యక్తం చేశారు.
 
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా విఫలం  అయిపోయిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీపీఐ, సీపీఎం గుర్తు ఏదో కూడా తెలియకుండా ఉందని ఎద్దేవా చేశారు. 
 
ఎన్నికల అక్రమాలపై బిజెపి నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని,  పైగా ఫిర్యాదులు చేసిన వారిపైననే పలు చోట్ల కేసులు నమోదు చేశారని సంజయ్ ధ్వజమెత్తారు. 
 
కాగా, పాతబస్తీలో పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ అంతటా 25 శాతం పోలింగ్ మించలేదు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదు అయింది. పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు. 
 
సాయంత్రం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా బాగ్‌అంబర్‌పేట్ 64.82 శాతం, అత్తాపూర్ 54.95, బంజారాహిల్స్‌ 35.50, జూబ్లీహిల్స్‌ 30.08 శాతం నమోదయింది.  
కాగా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను భర్తరఫ్ చేయాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ క్రమంలో హైదరాబాద్ లో స్థానికేతరులు ఉండొద్దని చెప్పినా.. మంత్రి పువ్వాడ ఎందుకున్నారని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పువ్వాడపై చర్చలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని నారాయణ ప్రశ్నించారు.