కేసీఆర్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ లపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నానని  మాజీ ఎంపీ, బిజేపీ నేత వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నికలకు డబ్బులు పంపిస్తున్నాననీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడితో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ త‌మ‌ సంస్థ పై కేసు లు నమోదు చేశారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఎలాంటి విచారణ చేయకుండానే హైదరాబాద్ కమిషనర్ తమ సంస్థ పై కేసులు ఎలా నమోదు చేస్తారు అని ప్ర‌శ్నించారు. ఎటువంటి ఆధారం లేకుండానే అంజనీకుమార్ ప్రెస్ మీట్ పెట్టి తమ సంస్థ పై ఎలా ఆరోపణలు చేస్తాడని నిలదీశారు. 

త‌న‌ మీద నిరాధారమైన, తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినందుకు దావా వేశానని చెబుతూ వారు బేషరతుగా  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త‌న‌ మీద నిరాధార, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు పంపుతున్నానంటూ వివేక్ వెంకటస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ అహంకార రాజ్యం నడుస్తుందని, కొంతమంది పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్లుగా ముఖ్యమంత్రి వాడుకుంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. మంచి పోస్టింగులు పొందేందుకు ముఖ్యమంత్రికి పోలీసులు అనుకూలంగా వ్యవరిస్తున్నారనిదయ్యబట్టారు. నిజాం సర్కార్ మాదిరిగా కెసిఆర్ వ్యవరిస్తున్నాడని వివేక్ మండి ప‌డ్డారు.