రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. అదేసమయంలో, ఈ కేసు వివరాలు మీడియాలో రాకూడదన్న(గ్యాగ్) ఆదేశాలను మాత్రం సుప్రీంకోర్టు నిలిపి వేసింది.
ఏసీబీ దర్యాప్తు నిలిపివేతతోపాటు గ్యాగ్ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించడంతో తమ ‘గ్యాగ్ ఆర్డర్’ నిష్ఫలమైందని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై ఉన్న స్టే ను ఎత్తివేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వర కు దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి ని ర్ణయం తీసుకోవద్దని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.
‘‘నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సెప్టెంబరు 15న హైకోర్టు ఆదేశాలివ్వగా… ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. అంటే… హైకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లే’’ అని దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తేల్చిచెప్పారు. అయితే… హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసినందునే సమాధానం ఇవ్వలేదేమో అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దాని గురించి తెలుసుకుంటామని తెలిపింది.
హైకోర్టు ఉత్తర్వులు తప్పుగా ఉంటే స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టునే ఆశ్రయించి ఉండాల్సిందని సాల్వే అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఎత్తివేయాలని హైకోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 136ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
హైకోర్టుకు సమాధానం ఇస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అని ప్రశ్నించారు. హై కోర్టు మీద విశ్వాసం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ కేసును హైకోర్టునే విచారించనివ్వండి. స్థానిక పరిస్థితులు హైకోర్టుకే బాగా తెలుస్తాయి’’ అని తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా తన సానుభూతిపరులతో న్యాయమూర్తులను భయపెట్టించడానికి, బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… ఈ వ్యవహారంపై హైకోర్టు దర్యాప్తునకు కూడా ఆదేశించిందని హరీశ్ సాల్వే తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా 45 మందికి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో హైకోర్టుకు తెలుసని తెలిపారు.
ఎవరిపైన అయినా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు జరపాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ప్రశ్నించారు. రాజధాని భూములపై మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసిందని, ఆ తర్వాత 7 నెలలకు ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు.
ఏసీబీ కేసు కొట్టివేయాలని దమ్మాలపాటి హైకోర్టులో విజ్ఞప్తి చేయలేదని, ముందస్తు బెయిల్ మంజూరుతోపాటు ఎఫ్ఐఆర్లోని వివరాలను మీడియా ప్రచురించకుండా అడ్డుకోవాలని మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. కానీ… హైకోర్టు మాత్రం దర్యాప్తును నిలిపివేసిందని పేర్కొన్నారు.
‘‘దర్యాప్తును హైకోర్టు ఎలా ఆపగలదు? ఎఫ్ఐఆర్లో 13 మంది పేర్లు ఉన్నాయి. దమ్మాలపాటి ఒక్కరు మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం అందరికీ ఉపశమనం కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వం కేసు నమోదు చేసిందని కూడా హైకోర్టు పేర్కొంది” అని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించింది. 2014 జూన్లో ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న సమాచారం తెలిసింది. జూన్ నుంచి డిసెంబరు వరకు… ఆరు నెలల్లో పెద్ద సంఖ్యలో భూ లావాదేవీలు జరిగాయి. “2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం 2019 డిసెంబరులో తొలి నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది’’ అని ధవన్ వివరించారు.
ఈ అంశంపై దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీబీఐ తోసిపుచ్చిందని తెలిపారు. ‘హైకోర్టు ఇలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చా’ అన్నదే తమ ప్రశ్న అని ధవన్ పేర్కొనగా… ‘అది వేరే అంశం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కాగా, ఎఫ్ఐఆర్పై మీడియా కథనాలు ప్రచురించవద్దన్న హైకోర్టు ఆదేశాలు సహారా కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దమ్మాలపాటి తన పిటిషన్లో పేర్కొన్నారని ప్రస్తావించారు.
‘‘ఇలాంటి చర్యలు దురదృష్టకరం. దాన్ని నేను సమర్థించడంలేదు. అయితే… ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలా వద్దా?’’ అని రాజీవ్ ధవన్ ప్రశ్నించారు. దాంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదుల తరఫు వాదనలు వింటామని తెలిపింది.
అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కూడా నిర్ణయం తీసుకోవాలని ధవన్ విజ్ఞప్తి చేశారు. దాన్ని కూడా పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
25 అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గతంలో దమ్మాలపాటి వాదించారని… అందుకే ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. న్యాయవాదులను టార్గెట్ చేయడమేంటని అడిగారు.
‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం కేసులు ఎదుర్కొంటున్నారు. 16 నెలలు జైలుకు కూడా వెళ్లారు. ఈ పరిణామాల రీత్యా రాజకీయంగా కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని సాల్వే తెలిపారు. రాజధా ని నిర్ణయం విషయంలో రహస్యమేమీ లేదని స్పష్టం చేశారు.
More Stories
విశాఖ స్టీల్ మూతపడే దుస్థితి శోచనీయం
రాజంపేటను జిల్లా చేయకుండా అడ్డుకున్న జగన్
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’