‘నివర్‌’  తుఫాన్ తో ఏపీలో రెడ్ అలెర్ట్ 

‘నివర్‌’ అతి తీవ్ర తుపాన్‌గా మారి దూసుకొస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ఎపికి ముంచుకొస్తోంది. తమిళనాడులోని కరైకల్‌, మామళ్లపురం మధ్య తీరాన్ని తాకిన అనంతరం ఎపిలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 

ఈ క్రమంలోనే ఎపిలోని చిత్తూరు జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 

తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచే వర్షాలు మొదలయ్యాయి. దీంతో కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. 

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేరుగా ఎపి ని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. 

ఈ తుపాను ప్రభావం బుధవారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.