ఏపీలో 12 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి 

ఏపీలో 12 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొన్ని కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, నలుగురు బాధితులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ తాజా పరిస్థితిపై స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్నవి కేవలం అక్కడక్కడా వస్తున్న చెదురుమదురు కేసులు మాత్రమేనని, వైరస్ వేగంగా విస్తరించడం లేదని స్పష్టం చేశారు.  మన పొరుగు రాష్ట్రాలైన కేరళ (115 కేసులు), కర్ణాటక (64 కేసులు), తమిళనాడు (39 కేసులు) లతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని ఆయన గణాంకాలను వివరించారు. 
ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని అధికారులు ప్రాథమికంగా తేల్చినట్లు మంత్రి తెలిపారు.  మరణించిన వారిలో ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లే వైరస్ ప్రభావం ఎక్కువగా చూపించిందని వివరించారు. అయినప్పటికీ వైరస్ రకాన్ని మరింత ఖచ్చితంగా తెలుసుకోవడానికి నమూనాలను పుణెలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (ఎన్ఐవి) కి పంపినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను, శానిటైజర్లను సిద్ధంగా ఉంచిందని, కడప వంటి జిల్లాల్లో అత్యవసర సేవల కోసం ‘రాపిడ్ రెస్పాన్స్’ బృందాలను రంగంలోకి దించినట్లు సత్యకుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక గైడ్‌లైన్స్ రాలేదని పేర్కొంటూ ప్రస్తుత వర్షాకాల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు.

ఏపీలో జూన్ 26 నుండి జూలై 16 మధ్య కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఈ నెల 339 కేసులు నమోదవ్వగా అత్యధికంగా కేరళలో 115 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్, నికోబార్‌లో 8, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.