ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’

ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
 
* టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ
 
గ్రామాల అభివృద్ధి లేకుండా జగన్ సొంత అవసరాలకు డబ్బులు వినియోగించారని, ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, అయితే, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
 
కార్మికులు, రైతులు, యువతను అసలు పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ స్వార్ధ ప్రయోజనాలే చూసుకున్నారని, శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలతో  కోట్ల రూపాయలు దోచుకున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.
ప్రధానమంత్రి మోదీ ఆవాస్ యోజన కింద 23లక్షలు ఇళ్లు ఏపీకి కేటాయించారని, కేవలం మూడున్నర లక్షల ఇళ్లు మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 
 
కేంద్రం ఇచ్చిన వేల‌ కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని, కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు తెచ్చేలా చేశారని, అభివృద్ధి, సంక్షేమం సమానంగా తీసుకెళ్లి ఆదర్శ పాలన అందించారని పీయూష్ గోయల్ కొనియాడారు. మోదీ మేక్ ఇండియా 2047 లక్ష్యాలను సాధించాలని, యువత ఇందులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. 

పేదల కోసం పూర్తిగా ఉచిత బియ్యం మోదీ అందించారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు కల్పించారని, ప్రతి ఇంటికి కుళాయి, మరుగుదొడ్డి నిర్మాణం సాకారం చేశారని తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటికొరత లేకుండా చేశారని, నారీ శక్తి ద్వారా మహిళలు వివిధ రంగాల్లో నిలబడేలా చేశారని, స్వతంత్య్రంగా ఎదగడానికి అనేక రుణాలు అమల్లోకి తెచ్చారని, ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను నెలకొల్పారని పీయూష్ గోయల్ వివరించారు.

కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. 

టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై వీరు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ జరుపతలపెట్టిన రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి చర్చించారు.