యూపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పై ఉగ్ర దాడికి భారీ కుట్ర

యూపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పై ఉగ్ర దాడికి భారీ కుట్ర

డిల్లీలోని ఎర్రకోట బాంబు పేలుడు కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భయంకరమైన ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీతో పాటు, జనాలు ఎక్కువగా తిరిగే పలు ప్రముఖ ప్రాంతాల్లో వరుస ఉగ్రదాడులు జరపడానికి నిందితులు ప్లాన్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.

“ఈ ఉగ్రకుట్రలో భాగంగానే ఎర్రకోట పేలుడు నిందితులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయూద్లు హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి లఖ్నవూకు వెళ్లారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం 2025 ఆగస్టు 25 నుంచి 30 మధ్య వీరు లఖ్నవూలో రెక్కీ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని కీలక భవనాలపై దాడులకు ప్లాన్ చేశారు” అని తెలిపారు. 

“అందులో భాగంగా యూపీ అసెంబ్లీ, బాపు భవన్ (సివిల్ సెక్రటేరియట్)తో పాటు జనాలు భారీగా వచ్చే ఇమాంబరా, లాల్బాగ్, అమీనాబాద్ ప్రాంతాలపై ముజమ్మిల్ రెక్కీ నిర్వహించాడు. ఈ ప్రాంతాలు తమ ఉగ్రదాడులకు సరిగ్గా సరిపోతాయని నిందితులు భావించారు. ఈ భవన సముదాయాల సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన కారును పేల్చాలని వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు” అని ఓ ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. 

ఎన్ఐఏ దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. లఖ్నవూలో ‘ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్’ (టీఏటీపీ) తయారీకి అవసరమైన రెండు రసాయనాలు (ప్రికర్సర్ కెమికల్స్) దొరికే షాపుల కోసం ముజమ్మిల్ తన ఫోన్లో వెతికాడు. ‘మదర్ ఆఫ్ సైతాన్’ అని పిలిచేఈ టీఏటీపీ రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. 2025 నవంబర్ 10వ తేదీన దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో కూడా ఇదే రసాయనాన్ని ఉపయోగించారు. 

ముజమ్మిల్ ఆదేశాల మేరకు షాహీన్ ఆ రసాయన దుకాణాల పేర్లను తన సొంత చేతిరాతతో ఒక కాగితంపై రాసుకుంది. ఆ తర్వాత దీనిని ఆమె తన ఫోన్లో ఫొటో తీసుకుంది. ఆ లిస్టును ఎన్ఐఏ అధికారులు ఆమె ఫోన్ నుంచే స్వాధీనం చేసుకున్నారు. లఖ్నవూకు రెక్కీ కోసం వచ్చిన ఆ ఇద్దరు ఉగ్రవాదులు లాల్బాగ్లోని ఖండారీ బజారులో ఉన్న షాహీన్ బంధువల ఇంట్లో బస చేశారు. 

ఆ తర్వాత లఖ్నవూకు చెందిన, ఆ నగరంపై పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తి(సాక్షి)ని ముజమ్మిల్ సంప్రదించాడు. తాను చెప్పిన రసాయన దుకాణాలకు స్వయంగా వెళ్లి, సదరు కెమికల్స్ భారీ పరిమాణంలో ఉన్నాయో, లేవో కనుక్కోవాలని కోరాడు. ముజమ్మిల్ బయటి వ్యక్తి కావడం వల్ల నేరుగా వెళ్తే అనుమానం వస్తుందని గ్రహించి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు స్థానికుడైన ఆ వ్యక్తిని ఈ పని కోసం వాడుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఫరీదాబాద్‌లోని ఖోరీ జమాలపూర్‌లో తాము అద్దెకు తీసుకున్న ఇంట్లో ఏ విధంగానైతే రహస్యంగా కార్యకలాపాలు సాగించారో, అదే రీతిలో పేలుడు పదార్థాల తయారీని గుట్టుగా కొనసాగించేందుకు వీలుగా, నగరంలోని ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక స్థలం కోసం నిందితులు గాలించారు. పలువురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక విశ్లేషణలతో కూడిన సమగ్ర దర్యాప్తును నిర్వహించడం ద్వారా, అలాగే ఆర్థిక లావాదేవీల ఆచూకీని అనుసరించడం ద్వారా, ఈ లక్నో పర్యటనలో చోటుచేసుకున్న సంఘటనల పూర్తి క్రమాన్ని ఎన్ఐఏ నిర్ధారించింది.

అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యఐఎస్)తో సంబంధం ఉన్న అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎజియుహెచ్) మధ్యంతర ఉగ్రవాద ముఠా, ఘోరమైన ఎర్రకోట పేలుడుకు ఉపయోగించిన అదే పేలుడు పదార్థాల తయారీ పద్ధతితో లక్నోలో వరుస పేలుళ్లకు పాల్పడాలనే లక్ష్యంతో ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించినట్లు ఉగ్రవాద నిరోధక సంస్థ దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వైద్య నిపుణులు ఇందులో పాలుపంచుకోవడం వల్ల “డాక్టర్” లేదా “వైట్-కాలర్” మాడ్యూల్ అని కూడా పిలువబడే ఈ ముఠాను ఛేదించడంతో వారి ప్రణాళికలు విఫలమయ్యాయి.