29న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక 

ఈనెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. 
 
ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:10కి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. 29న సాయంత్రం 5:10కి తిరిగి మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది.  
 
మరోవంక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతాపార్టీ అతిరథ మహారథులంతా తరలిరానున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈనెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నగరానికి రానున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్‌ షా పాల్గొంటారు.
శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభకు హాజరవుతారు. అనంతరం, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్డు షోలో నడ్డా పాల్గొంటారు.