క్లీనెస్ట్ సిటీ గా హైదరాబాద్ ……… బిజెపి మేనిఫెస్టో 

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని, ప్రజలందరికి 24 గంటలు ఉచితంగా తాగునీరు అందించడంతో పాటు కాలుష్యం నుండి విముక్తి కలిగిస్తామని చెబుతూ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను నేడు బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు కె లక్ష్మణ్‌, డీకే అరుణ, వివేక్‌ వెంకటస్వామి పాల్గొన్నారు.  మేనిఫెస్టోలో బిజెపి ఇచ్చిన హామీలు:

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదల్లో నష్టపోయిన వారందరికీ రూ 25,000 చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తాము. నగర ప్రజలు అందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి చేస్తాము. తెలంగాణ విముక్తి దినం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం. 
 
హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తాం. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాము.  హైదరాబాద్ ను `అమృత్’ నగరంగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు సమకూర్చుకొని సమగ్రాభివృద్ధికి పలు పధకాలు అమలు చేస్తాము. 
 
పట్టణాభివృద్ధి సంస్థను పటిష్ఠపరచి, కాలుష్య నివారణకు అదనపు నిధులు కేటాయించి దేశంలోని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతాము.  74వ రాజ్యాంగ సవరణ ప్రకారం లభించే అన్ని అధికారాలు, విధులు అమలయ్యేటట్లు చూస్తాము. పౌర సేవలను పొందటం ప్రాధమిక హక్కుగా గుర్తించి ఒక ప్రత్యేక చట్టం తీసుకు వస్తాము. 
 
రూ 10,000 కోట్లతో మూసి నది ప్రక్షాళన కావించి ఆహ్లాదకరమైన నదిగా అభివృద్ధి చేస్తాం. మూసి పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం మూసి జలాల శుద్ధికోసం 20 ప్రాంతలాలో సీవరేజ్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తాము. వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ లోని అన్ని నాలాల పునరుద్ధరణ కావిస్తాం. 
 
అంతేకాకుండా, మురికి వాడలను ఆధునిక నివాసయోగ్య ప్రాంతాలుగా మలచడంతో పాటు పాలనావ్యవస్థలోనే కాకుండా రాజకీయ పరమైన అవినీతిని కూడా తుదముట్టించి స్వచ్ఛమైన పాలన అందించగలము. స్వచ్ఛమైన పరిసరాలతో పాటు స్వచ్ఛమైన రాజకీయాలు కూడా అందిస్తాము. గ్రేటర్ హైదరాబాద్ పట్ల బిజెపికి సమగ్రమైన దృష్టి, ప్రణాళికలు ఉన్నాయని మేము విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక స్పష్టం చేస్తుంది. 
 
ప్రతి డివిజన్ కు ఒక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తాము. డివిజన్ ల వారీగా సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుతాము. ఇక ప్రతి డివిజన్ లో అక్కడి జనాభా అవసరాలకు అనువుగా చిల్డ్రన్ ప్లే జోన్, ఈత కొలనులు ఏర్పాటు చేస్తాము. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం హై క్వాలిటీ వైఫై సదుపాయం కల్పిస్తాము. 
ప్రతి డివిజన్ లో నాలుగు స్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు నగరం నలువైపులా ఆధునిక డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేస్తాం. రహదారులు గుంటలు పడితే 15 రోజుల్లో మరమ్మతులు చేపిస్తాము. లేనిపక్షంలో కాలనీ సంక్షేమ కమిటీలు చేసుకొంటే వారికి తగు వ్యయం అందిస్తాము. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ తో పాటు 24 గంటలు తాగునీటి సరఫరా ఉంచితంగా చేస్తాము. 
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాను నగరంలో అమలు చేయడంతో పాటు అన్ని బస్తి దవాఖానలో హెల్త్ అడ్వైజరీ సెల్ లను ఏర్పాటు చేస్తాము. ట్రాఫిక్ రద్దీలను తగ్గించడం కోసం మెట్రో రైల్ సేవలను పాతబస్తీ, ఎయిర్ పోర్ట్, లింగంపల్లిలతో సహా నగరంలో అన్ని వైపులకు విస్తరింప చేస్తాము. మెట్రో స్టేషన్ల వద్ద సురక్షిత పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తాము. ద్విచక్రవాహనాలు, ఆటో లకు ఎటువంటి ట్రాఫిక్ జరిమానాలు లేకుండా చూస్తాము.
 
రిక్షా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, మార్కెట్ యార్డ్ లలో పనిచేసే కాంతికులకు రూ 5 లక్షల వరకు ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తాము. కరోనా కారణంగా దెబ్బ తిన్న వ్యాపారులను కోలుకొని విధంగా చేయడానికి వారికి ఆస్తిపన్నుతో పాటు లైసెన్స్ ఫీజ్ లలో కూడా 50 శాతం మేరకు రాయితీ కల్పిస్తాము. నగరంలో 20,000కు పైగా ఉన్న సెలూన్ లకు రూ 15,000 వరకు వడ్డీ లేని రుణాలు సమకూరుస్తాము. 
 
మహిళల సంక్షేమంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. సిటీ బస్సు, మెట్రోలలో ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఏడాదికి మూడు చొప్పున ఐదేళ్లలో 15 మహిళా పోలీస్ స్టేషన్ లను అదనంగా ఏర్పాటు చేస్తాము. మహిళలు కిలో మీటర్ కు ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తాము. అన్ని ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేసి, అక్కడ చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబు లను అందిస్తాము. 
 
విద్యార్థులలు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తాము. ప్రైవేట్ పాఠశాలల ఫీజ్ లను నియంత్రించడంతో పాటు కరోనా సమయంలో చితికి పోయిన ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆదుకొంటాము. 
 
లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాము. ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు చేయడంతో పాటు 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేకుండా చేస్తాం. ప్రజలందరికీ ఉచిత మంచి నీరు అందిస్తాం.  పేదలకు 100 యానిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తాము. ఆస్తిపన్నులపై భారీ జరిమానాలు లేకుండా చేస్తాము. పాత బస్తీలో ప్రతి ఏటా జరుగుతున్న రూ 600 కోట్లకు పైగా విద్యుత్ చౌర్యాన్ని పూర్తిగా అరికడతాము. 
 
లక్ష మందికి పైగా జనాభాకు సేవలు అందిస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంక్షేమంకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం ఉన్న 29,000 ఖాళీలను భర్తీ చేయడం ద్వారా వారికి పనిభారం తగ్గిస్తాం. వారికి పన్నుల మాఫీ జరిపి, ఎటువంటి పన్నులు వారి నుండి వసూలు చేయకుండ ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన క్రింద వారికి గృహనిర్మాణం కోసం రుణాలు అందిస్తాము. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము.
 
నగరంలోని మల్కాజగిరిలో గల దీనదయాళ్ నగర్ లో 12 ఏళ్ళ చిన్నారి సుమేధ ఓపెన్ నెలలో పది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నగరంలోని అన్ని ఓపెన్ నాళాలు, డ్రైనేజీ కాలువలను ఆధునీకరించడం కోసం రూ 10,000 కోట్లతో సుమేధ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాము. 
 
చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం కోసం ఒక ప్రత్యేక టాస్క్  ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నెల చెరువుల పరిష్టితులను పబ్లిక్ డొమియాన్ లో ఉంచుతాము. నాలాల ఆక్రమాలు అరికట్టడం కోసం కూడా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, అన్ని ఆక్రమణలను తొలగిస్తాం. 
 
ఆటో డ్రైవర్లు అందరికి ఆరోగ్య భీమా సదుపాయం కల్పించడంతో పాటు సొంత ఆటోలు గలవారికి భీమా, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం రూ 7,000 ఆర్ధిక సమయం అందిస్తాము. వీధి వ్యాపారులకు కూడా ఉచిత ఆరోగ్య భీమా కల్పిస్తాము. 
విద్యార్థులు పోటీ పరీక్షలకు సహకరించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అతిపెద్ద తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం కోసం నైపుణ్య శిక్షణ కల్పిస్తాము.