టీఆర్ఎస్ లో తిరుగుబాటుదారుల రగడ 

జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అధికార పక్షంలో తిరుగుబాటుదారుల రగడ కలకలం రేపుతున్నది. ఇప్పటికే గత ఎన్నికలలో ఎన్నికైన కార్పొరేటర్ల పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంటు ఉండడంతో నాలుగువంతు మందిని పైగా మార్చారు. అయినా అభ్యర్థుల ఎంపికపై నగరం అంతటా పార్టీ అధినేతలు ఎక్కడికక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 

ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్​గా బరిలోకి దిగేందుకు పలు డివిజన్ లలో  సిద్ధమయ్యారు. అధికార టీఆర్ఎస్​పార్టీకి రెబల్స్​బెడద ఎక్కువగా ఉంది. ఇతర స్థానాల్లోనూ ఏళ్లుగా టికెట్ల కోసం చూస్తున్నవారికి దక్కకపోవడంతో రెబల్స్ గా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

20 ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తనకు బాలాజీనగర్ ​డివిజన్​ టికెట్​ఇవ్వలేదని మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్​ భవన్​ ముందు నిరసన తెలిపారు. కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే ఒత్తిడితోనే తనకు టికెట్ దక్కలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్  స్పందించాలని కోరారు. నిరసనకు దిగిన మల్లేష్ యాదవ్‌‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. దీంతో ఆయన రెబల్​అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అడిక్‌‌మెట్ డివిజన్‌‌లో టీఆర్ఎస్ నుంచి బి.మనోహర్ సింగ్ కు టికెట్​ దక్కకపోవడంతో ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు.

తమకే టికెట్ కేటాయించాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ సమక్షంలోనే గొడవకు దిగారు. మనోహర్​కు అన్యాయం జరిగిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను నిలదీశారు. చివరకు పాత అభ్యర్థి హేమలతారెడ్డి పేరును ప్రకటించి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టీఆర్ఎస్​ నుంచి బాలానగర్​ డివిజన్​ టికెట్ఆ శించిన సంతోష్ గుప్తా చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో కలిసి శుక్రవారం నామినేషన్​వేశారు. రాంచంద్రాపురం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనుకున్న పరమేష్​యాదవ్ టికెట్​దక్కకపోవడంతో రెబల్​గా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు.

టికెట్ ​కేటాయింపు విషయం చంపాపేట్ లో టీఆర్ఎస్​నేతల మధ్య గొడవకు దారితీసింది. ఆ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి నిర్వహించిన అంతర్గత సమావేశం రసాభాసగా మారింది. సామ రఘుమారెడ్డికి టికెట్​ఇవ్వకపోవడంపై ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి ముందే రచ్చ రచ్చ చేశారు. సుధీర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

మాదాపూర్​ టికెట్ ​ఆశించిన శ్రీనివాస్ యాదవ్​అనుచరులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రెబల్​గా పోటీకి సిద్ధమయ్యారు. కాచిగూడ సిట్టింగ్​ కార్పొరేటర్​ ఎక్కల చైతన్య యాదవ్ కు పార్టీ మరోసారి టికెట్​ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్ పేట్​ డివిజన్ ​నుంచి లాస్ట్​ టైం ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన చెర్క మహేష్ కి ఈ సారి టికెట్​ దక్కలేదు. తాజాగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్​వేధింపులు తాళలేక​ పార్టీకి ఓ మహిళా నాయకురాలు ​రాజీనామా చేశారు.

టీఆర్ఎస్ లో ఉన్నా తనకు సపోర్టు చేయడం లేదంటూ గురువారం రాత్రి ఫసియోద్దిన్​ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని షర్మిల జాదవ్​ఆరోపించారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫసియోద్దిన్​అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ రాత్రంతా స్టేషన్​లోనే ఉన్నారు. తనపై  నిందారోపణలు చేస్తున్నందుకు టీఆర్ఎస్​పార్టీకి రాజీనామా చేశానని, శనివారం తన భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

తార్నాక సిట్టింగ్​ కార్పొరేటర్​ సరస్వతి డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై ఫైర్ అయ్యారు. రెండు కోట్లు ఉంటేనే టికెట్ ఇస్తానని పద్మారావు తనతో అన్నారని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ తనకే టికెట్​ ఇద్దామనుకున్నప్పటికీ పద్మారావు కావాలనే తనకు రాకుండా చేశారని ఆరోపించారు.

టీఆర్ఎస్​ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనకు టికెట్​ రాకుండా చేశారని మండిపడ్డారు. 150 డివిజన్ ల్లో ఒకే ఒక్క వడ్డేర సీట్​ఇదని, అదీ ఇప్పుడు అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని పద్మారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 లో ఇక్కడి నుంచి 14 వేల మెజారిటీతో గెలిచానని, అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. టీఆర్ఎస్​ రెబల్​గా పోటీ చేస్తానని, టీఆర్ఎస్​ జెండాలు, కండువాలు వేసుకొని ప్రచారం చేస్తానని సరస్వతి ప్రకటించారు.