టీఆర్ఎస్ ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే  

టీఆర్ఎస్ ఓటు వేస్తే  ఎంఐఎంకు కు ఓటు వేసినట్లేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ నగర ప్రజలను హెచ్చరించారు. ఎంఐఎంకు మేయర్ సీటు అప్పగిస్తే ఏ గుడికీ వెళ్లకుండా చేస్తారని వారించారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు తాను..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాని వెళ్లానని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను నిజాలు చెప్పేందుకు ఆలయాని వెళ్లానని స్పష్టం చేశారు  
 
భాగ్యలక్ష్మీ అమ్మవారి చరిత్ర తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని చెబుతూ ఆ గుడి పాకిస్తాన్ లో ఉందా, బాంగ్లాదేశ్ లో ఉందా లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉందా  అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి కారణంగానే హైదరాబాదుకు భాగ్యనగరం అనే పేరు వచ్చిందని గుర్తు చేశారు.
 
20 శాతం ఉన్న ముస్లింల గురించి కేసీఆర్ రెచ్చగొట్టినట్టు మాట్లాడొచ్చు కానీ 80 శాతం మంది హిందువుల గురించి తాను  మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్టు చేయండి సంజయ్ సవాల్ చేశారు తప్పుడు ప్రచారంతో టీఆర్ఎస్ ఓట్లు పోందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. 
 
కాగా,  వరద సాయంపై ఎన్నికల కమిషన్ కు తాను లేఖ వ్రాయలేదని మరోసారి స్పష్టం చేశారు. టీఆర్ఎస్  పధకం ప్రకారం నకిలీ లేఖను సృష్టించిందని విమర్శించారు. పైగా, ఆ లేఖపై ఉన్నది కూడా తన సంతకం కాదని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామని చెబుతూ ఎన్నికల కమిషన్ కూడా తమకు ఎలాంటి లేఖ రాలేదని  చెప్పిందని పేరన్నారు. ఈ లేఖపై  రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు.
“నిజంగా నేనే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం నాపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఫోర్జరీ లేఖ గురించి నేను చేసిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?” అంటూ ప్రశ్నించారు.  బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదు. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటోందని సంజయ్ స్పష్టం చేశారు.   
 
 ఓట్లు కోసమే 40 వేల మంది రోహింగ్యాలను టీఆర్ఎస్ కాపాడుతోందని బిజెపి ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతామని వెల్లడించారు.  తప్పుడు ప్రచారంతో టీఆర్ఎస్ ఓట్లు పోందాలని చూస్తోందని పేర్కొంటూ నగరంలో ఐదేళ్ల టీఆర్ఎస్ పాలనపై రేపు చార్జిషీట్ తో పాటు బిజెపి మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.