ఉగ్రవాదులు, దేశవ్యతిరేకులకు అడ్డాగా బెంగాల్   

ఉగ్రవాదులు, దేశవ్యతిరేకులకు అడ్డాగా పశ్చిమబెంగాల్ మారిందని, కశ్మీర్ కంటే ఇక్కడ పరిస్థితి దిగజారిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డాయిరు. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని బారానగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం  మీడియాతో మాట్లాడుతూ  ఆరుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను నార్త్ బెంగాల్‌లో అరెస్టు చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర నెట్‌వర్క్ నడుస్తోందని చెబుతూ భారత్ లో ఉగ్రవాదులు శిక్షణ పొంది బంగ్లాదేశ్‌లో కల్లోల సృష్టికి పంపుతున్నారని ఆదేశ నేత ఖలేదా జియానే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా పశ్చిమబెంగాల్ మారుతోందని ధ్వజమెత్తారు.
ఇతర ప్రాంతాల నుంచి వాళ్లు (ఉగ్రవాదులు) ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారని ఆరోపిస్తూ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి కశ్మీర్ కంటే దిగజారిందని ఘోష్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు భయంతో బతుకులు గడుపుతున్నారని చెప్పారు.
కాగా, జాతివ్యతిరేకుల హిట్‌ లిస్ట్ జాబితాలో తన పేరు కూడా ఉందని ఘోష్ చెబుతూ  రోహింగ్యా ముస్లింలు ఎక్కువగా ఉన్న అలిపురూదూర్ జిల్లాలోని జేగావ్‌లో తనపైన కూడా దాడి జరిగిందని గుర్తు చేశారు.  జరిగిన ఘటనను సంబంధించిన వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, ఆ వ్యక్తులు బెంగాల్‌కు చెందిన వారు కారనే విషయం గుర్తించవచ్చని చెప్పారు.
బెంగాల్‌లో లెక్కకు మిక్కిలిగా ఉన్న రోహింగ్యాలు, ఇతర చొరబాటుదారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటేస్తుంటారని ఘోష్ ఆరోపించారు. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయం కల్గిస్తుండటం ఆదోంళన కలిగిస్తోందని తెలిపారు.
బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా అన్ని పార్టీలు పోటీ చేసినా ఏ పార్టీకి ఓటు వేయాలో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్న ధీమాను ఘోష్ వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఏదైనా జరగవచ్చని చెప్పారు.
పలు రాజకీయ పార్టీలు ఇక్కడకు వచ్చి పోటీ చేయవచ్చని అంటూ  బీజేపీకి అది పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు.  ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని తమ పార్టీ కల్పిస్తుందని చెప్పారు. బెంగాల్‌లోని 45 శాతం మంది ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
టీఎంసీ, సీపీఐ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి పోటీ చేయవచ్చని చెబుతూ  అభివృద్ధికి పాటు పడే పార్టీ ఒకవైపు, అశాంతిని సృష్టించే పార్టీలన్నీ మరోవైపు ఉంటాయని నర్మగర్భంగా చెప్పారు.