25న మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం 

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేసింది ఇండియన్ బ్యాంక్‌. తమ బ్యాంక్‌కు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవటంతో అధికారులు ఆస్తుల జప్తుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గంటా శ్రీనివాస్ రూ 248 కోట్లు బకాయిలు ఉండగా ఈనెల 25న ఆన్‌లైన్‌లో బ్యాంకు అధికారులు ఆక్షన్‌ నిర్వహించనున్నారు. 

ఈ మేరకు ఈ-ఆక్షన్‌ సేల్‌ నోటీసును హైదరాబాద్‌లోని ఇండియన్‌ బ్యాంకు సామ్‌ బ్రాంచ్‌ జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ కొన్నేళ్ల క్రితం లోన్ తీసుకుంది. దానికి సంబంధించి రూ.141.68 మేర బ్యాంకుకు బకాయి పడింది. ఆ కంపెనీకి గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 

అయితే బకాయిలను చెల్లించాలని 2016, అక్టోబరు 4న మొదటిసారి ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు నోటీసులు పంపించింది. కానీ రుణం చెల్లించలేక ఆ కంపెనీ చేతులెత్తేసింది. ఇన్నాళ్ల పాటు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఆ రుణం విలువ రూ.248 కోట్లకు చేరింది. ఈ క్రమంలో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్‌ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది.

వేలం వేయనున్నఆస్తులు

* గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ఉన్న వాణిజ్య భవనం

* గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో త్రివేణి టవర్స్‌లోనున్న ఫ్లాట్, అదే ప్రాంతంలోని పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోనున్న మరో ఫ్లాట్‌

* ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామం దగ్గర కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం

* ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ద్వారకానగర్‌ మొదటి లైన్‌లోని శ్రీశాంతా కాంప్లెక్స్‌లో ఉన్న ఆస్తి

* పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి

* ప్రత్యూష అసోసియేట్స్‌ షిప్పింగ్‌ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్‌లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోనున్న ఆస్తి, అదే సంస్థకు అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆస్తి

* ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి