ప్రముఖ సాహిత్య వేత్త జీడిగుంట మృతి 

టాలీవుడ్‌ హీరో వరుణ్‌సందేశ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాత, ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి (80) కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడి మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. 

తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమాధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగానూ గుర్తింపు పొందారు. 1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్‌ సహకార బ్యాంక్‌లో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసి, అనంతరం 1971లో హైదరాబాద్‌ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. 

ఈ నేపథ్యంలో 1960లో ఆయన తొలిసారిగా రచించిన ‘హంసగమన’ అనే కథ ప్రచరితమయ్యింది. ఆ తర్వాత ఆయన 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్‌ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు. కథలు, నవలలే కాకుండా.. సినిమాలకు సంభాషణలు ఆయన కలం నుంచి జాలువారాయి. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు. 

ఆ తర్వాత తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’, ‘పెళ్లిళ్లోరు పెళ్లిళ్లు’ అనే సినిమాలకు సంభాషణలు రాశారు. మరో ‘మాయాబజార్‌’, ‘అమ త కలశం’ చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్‌ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్‌ రాశారు. 

జీడిగుంట‌ రామ‌చంద్ర‌మూర్తికి ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అంటే వరుణ్ తేజ్ తండ్రితో సహా అమెరికాలోనే ఉంటారు. మూడో కొడుకు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లతో నటిస్తుంటాడు.