దుబ్బాక విజయం అసాధారణం… కారణాలు ఎన్నో 

 
డా వడ్డీ విజయసారధి 
మన మీడియా ఎన్నికల ఫలితాలను ఎలా ఉద్దేశ్యపూర్వకంగా వక్రీకరిస్తుందో దుబ్బాక ఫలితమే స్పష్టం చేస్తుంది. టి ఆర్ ఎస్ గెలిస్తే కే సి ఆర్ సంక్షేమ పథకాల ప్రభావం అని రాసే వారు. కానీ బి జె పి గెలిచినా రామజన్మభూమి భూమి పూజ, ఆర్టికల్ 370రద్దు,కేంద్రం లో అవినీతి రహిత పాలన తో ప్రభావమయిన యువత గురించి ఒక్క వార్తాపత్రిక రాయలేదు.

స్పష్టంగా దేశంలో 6 ఏళ్లలో వచ్చిన మార్పులను మీడియా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరి స్తూ బి జె పి గెలవడం ఎదో కుట్రలు పన్ని గెలిచినట్లు రాస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ వల్లి,ఎం ఐ ఎం వల్ల ఆర్ జే డి వొడి పోయింది అని రాస్తారు.  కానీ దేశం లో బి జె పి మీద యువతలో పెరిగిన విశ్వాసం గురించి ఒక్క మీడియా సంపాదకీయం రాయలేదు. 
 
మీడియా వృద్ద తిరోగమన దేశ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,సోషల్ మీడియా ద్వారా నిజాలను ఇంకా విస్తృతంగా చెప్పాలి . ఒక్క ఇంగ్లీషు పేపర్ సంపాదకీయం కూడా ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి భూమి పూజ, అవినీతి రహిత పాలన,ట్రిపుల్ తలాక్ రద్దు,అతి తక్కువ వడ్డీకి రుణాల లభ్యత, జి ఎస్ టి, వ్యవసాయ క్రొత్త మార్కెట్ లాంటి మార్పుల ప్రభావం గురించి చర్చించక పోవడం గమనార్హం. 
 
కనీసం బిజేపి నాయకులు కూడా మీడియా చర్చలో ఈ అంశాలు ప్రస్తావించక పోవడం అంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న మంచి పై ముసుగు కప్పే మీడియా ప్రయత్నాలకు సహకరిస్తున్నట్లుంది. 
దుబ్బాకలో ప్రజావిజయానికి దారితీసిన  రెండు ప్రధానాంశాలు :  1. కే  సి ఆర్ కి  పాఠంచెప్పాలని యువత ఆకాంక్షను గుర్తించటం. 2. భాజపా రఘన్నకు వోటుద్వారా నే అదిసాధ్యమని నచ్చజెప్పటం.
 

ఏదైనా ఒక పరిణామానికి మనకుండే ఓపికను బట్టి ఎన్ని కారణాలైనా జాబితా వ్రాసుకోవచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి, భాజపా అభ్యర్థి రఘునందనరావు గెలుపులకు దారి తీసిన పదిఅంశాలను మీ ముందుంచా లనుకొంటున్నాను.

1. తెలంగాణ అంతటా తెరాస కుటుంబ పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. గట్టిగా నిలదీసేవారు, ఎండగట్టేవారూ ఉంటేనే అది వ్యక్తమవుతుంది. అటువంటి వారు కనబడనిచోట్ల ‘మనం ఒకరిద్దరం బయటపడి ఎదిరిస్తే మాత్రం ఏమవుతుంది?’ అనుకొని ప్రజానీకం నోరుమూసుకొని ఉండి పోతున్నారు. అసంతృప్తికి కారణమేమిటంటే, ముఖ్యమంత్రి చాలాచాలా గొప్పమాటలు చెప్తున్నారు. వాగ్దానాలు చేస్తున్నారు, ఆశలు కల్పిస్తున్నారు.

 

మరి ఆపనులు చేయటంలేదా, అంటే అస్సలు చేయటంలేదని అనలేము. ఎక్కడ తనకు, తనకుటుంబానికీ లాభదాయకంగా ఉంటుందో అక్కడ మాత్రమే చేస్తారు. ఇది తెలంగాణలోని 116 నియోజకవర్గాలవారిలో అసంతృప్తికలిగిస్తున్న అంశం. ఐతే దీనినిదుబ్బాక ప్రజలు చూస్తున్నంత స్పష్టంగా మిగిలిన జిల్లాలవారు చూస్తుండకపోవచ్చు.

2. దుబ్బాక గ్రామీణ నియోజకవర్గం. అక్కడ ఒక రాజకీయపార్టీగా భాజపాకు యంత్రాంగం గాని, వ్యవస్థలుగానీ లేవు. అయితే 1991నుండి లోకసభకు పోటీచేస్తూవచ్చిన భాజపా అభ్యర్థులద్వారా పార్టీ కార్య ప్రణాళికలు, పార్టీ గుర్తు ప్రజలమధ్యకుపోతూనే ఉన్నవి. అన్నిసందర్భాలలోకాకపోయినా కొన్ని సందర్భాలలోనైనా తగినంత ఆదరణ లభిస్తునే ఉన్నది.

 
ప్రత్యేకించి 2014లోను, 2018లోను ఇక్కడినుండి శాసనసభకు పోటీచేసిన మాధవనేని రఘునందనరావు ఒకసారి తొమ్మిదిశాతం వోట్లను, మరోసారి 14 శాతంవోట్లనూ సాధించ గలిగాడు. 2019 లోకసభ అభ్యర్థిగానిలిచి మరింత ఎక్కువగా వోట్లు రాబట్ట గలిగినాడు. 
 
ఈవిధంగా ఆరు సంవత్స రాల వ్యవధిలో మూడుసార్లు విద్యావంతుడైన అభ్యర్థిగా సుపరిచితమైన వ్యక్తి అందుబాటులో ఉన్నాడు. సమస్యలను వివరించిచెప్పగల నేర్పూ, ఓర్పూ ఉన్నవాడు. అతడిని రంగంలో దించితే గెలుపు సాధించగలమన్న ఆశ పొడచూపింది.

3.  2018 ఎన్నికల్లో గెలుపొందలేకపోయినా, ఏదో ఒక విధంగా రఘునందనరావు ఈనియోజకవర్గ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తున్నాడు. అనేక టెలివిజన్ చానళ్ళలో జరిగే చర్చలలో పాల్గొంటూ ప్రభుత్వం వైపునుండి జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాడు. 
 

యూ ట్యూబ్ ద్వారా వీటిని మళ్ళీమళ్ళీ చూసుకొనేందుకుకూడా వ్యవస్థ జరిగింది. దీనితో తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టుతూ ఉండటం ప్రజల దృష్టికి వస్తున్నది. శాసనసభ్యునిగా ఉండిన సోలిపేట రామలింగారెడ్డి కోవిడ్ తో మృతి చెందిన దరిమిలా ఉప ఎన్నిక జరగబోతున్నదని తెలియవచ్చినప్పటినుండి రఘునందనరావు గ్రామాలకు వెళ్ళి ప్రజలతో సంబంధాలను పటిష్టం చేసుకున్నారు.

4.  గత సంవత్సరం లోకసభకు జరిగిన ఎన్నికల్లో పొరుగున ఉన్న కరీంనగర్, నిజామాబాద్ నియోజక వర్గాలనుండి భాజపా అభ్యర్థులు మంచి మెజారిటీ తో ఎన్నికైనారు.

 
నిజానికి 2014లోనే ఈ నియోజక వర్గాల నుండి, మరికొన్ని నియోజక వర్గాలనుండీ భాజపా అభ్యర్థులు ఎన్నిక కావలసింది. తెదేపాతో పొత్తుకుదిరి, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొంటున్న సభలలో చంద్రబాబు నాయుడుకూడా వచ్చి కూర్చోడాన్ని చాలామంది భరించలేక తెరాసకు వోట్లు వేసి గెలిపించారు.
 

ఏ విధమైన ప్రయోజనమూ లేకుండానే ఇక్కడి వారు భాజపాను ఎంచుకున్నారా… అనే ఆలోచన వీరికి కలిగింది. సహజంగానే దగ్గరలోఉన్న అక్కడి ప్రజలతో జరిగే సంభాషణల ప్రభావం వీరిపై ఉంది. తమకు దగ్గరలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి భాజపా అభ్యర్థి గెలుపుకు తామూ సహకరించాలనే అభిప్రాయం వారికీ కలిగింది.

5. భాజపా రాష్ట్ర నాయకత్వం పూనుకొని కదలినపుడు కొద్దిగానో గొప్పగానో ఫలితాలు వస్తుంటాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన యాత్ర పేరుతో అప్పటి రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి తెలంగాణ అంతా పర్యటించారు.

 
ఆ రోజులలోనే మహబూబ్ నగర్ నుండి శాసనసభకు ఉప ఎన్నిక జరిగింది. రాజకీయాలకు క్రొత్తవాడైనా , భాజపా అభ్యర్థి ఎన్నం శ్రీనివాసరెడ్డి గెలుపొందాడు. ఆ ఫలితం కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని కలవరపెట్టింది. భాజపా తెలుగునాట బలపడటం ఎంత ప్రమాద కరమో అంచనావేసుకొని , దానిని నివారించడానికి తెలంగాణ ఏర్పరిచేందుకు సోనియాగాంధీ దిగి వచ్చింది. 
 
ఇప్పుడు నూతనంగా అధ్యక్షబాధ్యతను చేపట్టిన బండి సంజయ కుమార్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, పరిపూర్ణానందస్వామి, శాసన సభ్యుడు రాజాసింగ్ వంటివారు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. 

అంతేకాక అనేక ఎన్నికలలో అనుభవం గడించిన జితేందర్ రెడ్డి, జి,వివేక్ మొదలుగాగల మాజీ ఎంపీలు, ఎం.ఎల్.ఏలు రెండు మూడు వారాలపాటు మకాంవేసి ఇంటింటికీ తిరిగి తమకు సానుకూలంగా వోటింగ్ జరిగేందుకు నడుం బిగించారు.

6. మండల కమిటీలు, శక్తికేంద్రాలు, బూత్ ఇన్చార్జ్ లు, పన్నా ప్రముఖ్ లు…ఇలా పార్టీకి వ్యవస్థ చేసుకోవాలి. రాష్ట్రనాయకత్వం దృష్టినికేంద్రీకరించి పనిచేయటంలో ఆ విషయంలోనూ దృష్టి సారించటం జరిగింది.

7. కాగా ప్రచారం ప్రారంభమవుతూనే తెరాస తెలిసీ తెలియక చేసిన పనులు భాజపాకు లాభదాయకంగా పరిణమించాయి. నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతిష్ఠ ఉన్న దివంగత శాసనసభ్యుడు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని నిర్లక్ష్యం చేసి రాజకీయానుభవం లేని సోలిపేట సుజాతమ్మను అభ్యర్థిగా ఎంపికచేశారు. ఆమె వైపునుండి తగినంత చొరవ లేకపోవటంతో ప్రచారభారమంతా నేరుగా హరీశ రావు మీద పడింది.

8. ఆర్థిక మంత్రిగారు అధికారగణాలకు ఏవిధమైన ఆదేశాలిచ్చారో ఏమోగాని, వారిచర్యలతో, అసత్యాలతో కూడిన ప్రకటనలతో అబద్ధపు కేసులు బనాయించి, భాజపా అభ్యర్థిని, వారిబంధువులను, భాజపా కార్యకర్తలనూ వేధిస్తున్నారనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది. అగ్నికి ఆజ్యంతోడైనట్లుగా తెరాసమీద వ్యతిరేకత బాగా రాజుకుంది.

9. ఆర్థికమంత్రి హరీశ్ రావు తెరాస అభ్యర్థిని గెలిపించటం ఎంతో కష్టమైన పనో సరిగా అంచనా వేసికొనలేదేమో! తనచేతిలో ఉన్న తేలిక పని అనుకొని ఉండవచ్చు. కరోనాబాధితులకు బియ్యము,పప్పు అన్నీ కేసిఆర్ గారే ఇస్తున్నారు, మోడీ ఏమీ ఇవ్వటంలేదు అని మాట్లాడారు.

 

అంతే గాక, భాజపా తరపున అనుభవ శూన్యులైనవారి మాటల లోనుండి ఒకటిరెండు మాటలు పట్టుకొని భాజపా ప్రదేశ్ అధ్యక్షునికి సవాలు విసరటము, రంగంలోకి రాబోతున్న మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకోవటమూ…ఇటువంటి పరిణామాలన్నీ కలిసి ఈ ఎన్నికలు సజావుగా జరగటం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టంలేదనే అభిప్రాయం బలపడజేశాయి.

10. ప్రత్యక్షంగా రంగంలో దిగి పనిచేసిన నాయకులు , కార్యకర్తలేగాక, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేర్చటంలో సోషల్ మీడియా మాధ్యమం గానూ కొందరు చురుకుగా పనిచేశారు. తెలంగాణ ప్రజానీకమంతా తమవైపు ఆశగా, ఆసక్తితో చూస్తున్నారని దుబ్బాక ప్రజలకు అర్థమైంది.

 

ఏనుగు కుంభస్థలంపై కొట్టి పాఠం నేర్పిన వారిగా చరిత్రలో నిలిచిపోయే సదవకాశాన్ని వదులుకోరాదన్న నిశ్చయానికివవచ్చి దేశంలో(మణిపూర్ లోకాక) ఎక్కడా లేనంత స్థాయిలో వోటింగ్ లో పాల్గొని ఘంటాపదంగా తీర్పు చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని  తీర్చిదిద్దటంలో ప్రభాతవెలుగు వంటిపత్రికలుకూడా దారిదీపాలుగా నిలిచినవనిచెప్పవచ్చు.

ఈ విధంగా పట్టుదలతో కూడిన వాతావరణం ఈ అసాధారణ విజయానికి కారణమైందని చెప్పవలసి ఉంది.  దుబ్బాక ప్రజానీకం ఈవిజయాన్ని స్వంతంచేసుకొని, తెలంగాణ ప్రజానీకం నుండేకాక యావద్భారత ప్రజానీకం నుండికూడా అభినందన లకు పాత్రులవుతున్నారు. ఇంతటి విజయానికి కేంద్రబిందువైన రఘునందనరావు గారిని కూడా అభినందించవలసి ఉందిగదా!

 
(రచయిత సుప్రసిద్ధ రచయిత, సామజిక కార్యకర్త, జాగృతి వారపత్రిక మాజీ సంపాదకులు, నవయుగ భారతి ప్రచురణల సంపాదకులు, పలు గ్రంధాల రచయిత)