సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులు 

ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ పద్దతి మార్చుకోవాలని  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 
 
అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ఓటమి భయంతో మొన్నటిదాకా రోజుకోరకంగా ఇబ్బందులకు గురి చేసి ఓటమి తప్పదని అక్కసుతో తమ  కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి , టి ఆర్ ఎస్ నాయకులకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. 
 
ఉప ఎన్నికలో దుబ్బాక సీటు తర్వాత  తన సీటుకు ఎసరు వస్తున్నదన్న భయంతో కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న రాక్షస క్రీడలో భాగమే ఈ అరెస్టులు అని విమర్శించారు. 
 
అక్రమ అరెస్టులు ఆపకపోతే తర్వాత జరిగే పరిణామాలను కేసీఆర్ ప్రభుత్వం అంచానా కూడా వేయలేదని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయని స్పష్టం చేశారు.