హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులపై హైకోర్టు ఆగ్రహం 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో నమోదవుతున్న`తప్పిపోయిన’  కేసులుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 8 వేల `తప్పిపోయిన’ కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఈ  కేసులు రెట్టింపు అయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 

వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి చెందిన మిస్సింగ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని పిటిషనీర్ వివరించారు. ఈ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన ప్రభుత్వం మిస్సింగ్ కేసుల మీద అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పింది. షీ-టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ కమిషన్‌‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ఇప్పటివరకు రాష్ట వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని, భవిష్యత్‌‌‌లో మిస్సింగ్ కేసులపై సర్కార్ ప్రణాళికలు ఏంటని ప్రశ్నించింది. 

ఏ వర్గాలకు చెందిన వారు ఎంతమంది అదృశ్యమయ్యారో విశ్లేషించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 3న నివేదిక అందిస్తామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమాధానం చెప్పారు. ఈ కేసును డిసెంబర్ 10కి హైకోర్టు వాయిదా వేసింది.