ఔషధ మొక్కల గార్డెన్ ప్రారంభించిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ  గుజరాత్‌లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్‌ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఆరోగ్యవ్యాన్‌లో 380 జాతులకు చెందిన ఐదు లక్షల ఔషధ మొక్కల్ని పెంచనున్నారు.

ఆరోగ్య వ్యాన్‌లో యోగా కేంద్రం, డిజిటల్ సమాచార కేంద్రం, ఆయుర్వేద ఆహారాన్ని అందించే కేఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. గార్డెన్‌లోని సౌకర్యాలను ప్రధాని మోడీ పరిశీలించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ ‌లో మొత్తం 17 ప్రాజెక్టులను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.  

కాగా, నర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును ప్రధాని ప్రారంభించారు. జంగిల్ స‌ఫారీగా పేరొందిన ఈ ప్రాంతాన్ని గుజ‌రాత్ స‌ర్కారు జూలాజిక‌ల్ పార్కుగా తీర్చిదిద్దింది. అనంత‌రం ఆ పార్కులోని టూరిస్టు వాహ‌నంలో ప్ర‌యాణిస్తూ జూలో జంతువులు అన్నింటిని వీక్షించారు. ఆ త‌ర్వాత‌ జూపార్కులోని ప‌క్షి ప్ర‌ద‌ర్శ‌న కేంద్రాన్ని ప్ర‌ధాని సంద‌ర్శించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొద్ది సేపు రెండు రామ చిలుక‌ల‌తో కాల‌క్షేపం చేశారు. ఏక్తా మాల్‌ను, చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును ప్రారంభిస్తూ గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రిలతో క‌లిసి న్యూట్రీ ట్రెయిన్‌లో చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కులో ప్ర‌యాణించారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రధాని  ప్రారంభించారు. 

తొలుత, శుక్రవారం గుజరాత్ కు చేరుకోగానే మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్(92) కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. గుజరాత్‌లో మొట్టమొదటి బిజెపి ప్రభుత్వం కేశూభాయ్ నేతృత్వంలోనే ఏర్పాటైంది. 

గుజరాత్ సూపర్‌స్టార్ నరేశ్‌కనోడా, ఆయన సోదరుడైన సంగీత దర్శకుడు మహేశ్‌కనోడా కుటుంబాలను కూడా ప్రధాని పరామర్శించారు. నరేశ్‌కనోడా(77) కరోనాకు చికిత్స పొందుతూ అక్టోబర్ 27న మృతి చెందగా, ఆ తర్వాత రెండు రోజులకు వృద్ధాప్య సమస్యలతో మహేశ్ కనోడా(83) మృతి చెందారు. నరేశ్ బిజెపి మాజీ ఎంఎల్‌ఎ కాగా, మహేశ్ మాజీ ఎంపీ. నరేశ్ కుమారుడు హితూ కనోడా బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌ఎ.