
దుబ్బాక ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నది. సిద్దిపేట సంఘటనతో క్షేత్రస్థాయి కేడర్ నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం దాకా అందరూ ఉపఎన్నికపై మీదే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి వారిలో కనిపిస్తున్నది. వారం రోజులుగా నియోజకవర్గంలోని ప్రతి చోటా సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తున్నారు.
ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటుండటం పార్టీ కేడర్లో జోష్ను పెంచుతున్నది. ఇతర ప్రాంతాల కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా దుబ్బాకకు వచ్చి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి. తమ అభ్యర్థి రఘునందన్రావుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్రెడ్డి, బాబూమోహన్తో పాటు ఇతర నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం సహా ఆరేండ్లలో అమలు కాని టీఆర్ఎస్ హామీలను ఓటర్లకు వివరిస్తున్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ లెక్కలతో వెల్లడిస్తున్నారు. అదే సమయలో ప్రధాని మోదీ చేబడుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్ర పథకాల్లో కేంద్రం వాటాను ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు.
దీంతో ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుండటం బీజేపీ కేడర్లో నూతనోత్సాహం నింపుతున్నది. పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాకతో మంచి అనుబంధం ఉండటం, ఏసమయంలోనైనా జనానికి అందుబాటులో ఉంటారన్న పేరు ఉండటం, గతంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికి తోడు మోదీ పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలత ఉపఎన్నికలో కలిసి వస్తుందని, తమదే గెలుపని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
వారం కిందట సిద్దిపేటలో రఘునందన్రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసులు చేపట్టిన సోదాలు, ఈ సందర్భంగా తలెత్తిన వివాదాలు, లాఠీచార్జ్, అరెస్టులు తీవ్ర దుమారం రేపాయి. అక్కడికి వెళ్లిన తనపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాలతో దుబ్బాక ఉప ఎన్నిక హీట్ రాష్ట్రానికంతటికీ పాకింది.
టీఆర్ఎస్ నేతలంతా బిజెపి లక్ష్యంగా ప్రచారం చేసుండడం గమనిస్తే వారిలో ఓటమి భయం ఏర్పడిందనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. బిజెపినే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ అధికార పార్టీ అగ్రనేతలు బిజెపి కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు.
More Stories
రాజద్రోహం సెక్షన్ కొనసాగాల్సిందే.. శిక్ష కూడా పెరగాలి
తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిన తెలంగాణ