ట్విట్టర్ క్షమాపణలు సరిపోవు, సంజాయిషీ ఇచ్చుకోవాలి 

లద్ధాఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపుతున్న ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని విద్రోహచర్యగా భావించాల్సి వస్తుందని వెంటనే రాతపూర్వక వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని ప్యానెల్ తెలిపింది. ఈ మేరకు అమెరికా కేంద్రంగా ఉన్న సామాజిక ప్రచార మాధ్యమం ట్విట్టర్‌కు సూచించారు. ఈ విషయంపై ట్విట్టర్ అధికారికంగా అఫిడవిట్ రూపంలో సమాధానం ఇచ్చుకోవల్సి ఉంటుంది  
 
లడఖ్‌ను చైనాలో భాగంగా పేర్కొనడంపై పార్లమెంటరీ పానెల్‌కు ట్విట్టర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఈ చర్యను ఏడేళ్ల జైలుశిక్ష విధించే నేరంగా పరిగణించవచ్చని కమిటీ చైర్మన్‌ మీనాక్షి లేఖి స్పష్టం చేశారు. డేటా ప్రొటెక్షన్‌ బిల్‌, 2019 కింద జరిగిన విచారణకు ట్విట్టర్‌ ప్రతినిధులు హాజరయ్యారని, వారిని విచారించినట్లు ఆమె తెలిపారు. 
 
బిజెపి ఎంపి మీనాక్షీ లేఖి సారథ్యంలోని డాటా ప్రొటెక్షన్ బిల్లు జెసిపి ఎదుట ట్విట్టర్ ఇండియా ప్రతినిధి హాజరయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
 
జరిగిన దానికి క్షమాపణ కోరినట్లు వివరించారు. అయితే కేవలం క్షమాపణలతో సరిపోదని, జరిగిన విషయం నేరపూరిత చర్య అని ఇది దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉందని పేర్కొంటూ ట్విట్టర్ వర్గాలు అత్యున్నత స్థాయిలో దీనిపై వివరణను ఇచ్చుకోవల్సి ఉంటుందని ఆదేశించారు.
 
భారత్‌ భావనలను సోషల్‌మీడియా గౌరవిస్తుందని ట్విట్టర్‌ పేర్కొందని అయితే ఇది భావనలకు సంబంధించిన అంశం కాదని, సౌభ్రాతృత్వం, సమానత్వానికి సంబంధించిన అంశమని ఆమె తేల్చి చెప్పారు. 
 
భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ట్విట్టర్‌లో లద్ధాఖ్‌ను చైనా భూభాగంలోని ప్రాంతంగా చూపించడం వివాదాస్పదం అయింది.   వారి చిత్రీకరణ మామూలు విషయం కాదని భారతీయ మ్యాప్‌ను సరిగ్గా చూపకపోవడం విద్రోహచర్యగా భావించాల్సి ఉంటుంది. ఈ కోణంలో నేరానికి పాల్పడ్డ వారికి కనీసం ఏడేళ్ల జైలు ఉంటుందని లేఖి హెచ్చరించారు.