నాయిని సతీమణి అహల్య మృతి

మాజీమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. నాయిని మృతి నుంచి తేరుకొకముందే ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య (68) గత రాత్రి కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అహల్య మృతి చెందారు. 

ఆమె కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల క్రితమే నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. నాయినిని కడసారి చూసేందుకు ఆయన భార్య అహల్య అపోలో అస్పత్రి నుంచి మినిస్టర్‌ క్వార్టర్స్‌కు వీల్‌చైర్‌లో వచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమెను ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. 

వీల్‌చైర్‌లోనే కూర్చోబెట్టి ఆక్సిజన్‌ అందిస్తూ భర్త భౌతిక కాయం వద్దకు తీసుకువచ్చి చూపించారు. ఆమె పరిస్థితిని చూసి వారి కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కోడలు శిల్పతోపాటు ఇతర కుటుంసభ్యులు, బంధువులు అక్కడికి వచ్చినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

నాయినికి ఆయన సతీమణికి కరోనా సోకింది. ఇద్దరూ కరోనా నుంచి కొలుకున్నారు. కోలుకున్న తర్వాత వీరిద్దరికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సోకింది. దీంతో భార్యాభర్తలను వేరువేరు సమయాల్లో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 

వీరిద్దరూ మృతితో ఆ కుటుంబాన్ని శోక సంధ్రంలో వదిలి వెళ్లారు. నాయిని సతీమణికి పెద్ద కుమారుడుకు, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి కూడా కరోనా సోకింది. అయితే కుమారుడు, అల్లుడు కరోనా నుంచి కోలుకున్నారు.