జీహెచ్ఎంసీ రోడ్లు చూసి మాట్లాడు కేటీఆర్  

2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్న కేటీఆర్ నేడు  జీహెచ్ఎంసీ రోడ్ల మీద పరిస్థితి చూసి మాట్లాడాలని బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి సవాల్ చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు.. ప్రగతిభవన్‌కు మాత్రమే పరిమితమయ్యయని ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరేండ్లు అయినా నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బంధువులకు కాంట్రాక్టులు, కమీషన్లు కేటాయించడంలో సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ.. ప్రజల మీద లేదని ఆయన దుయ్యబట్టారు. 

‘కేసీఆర్ అభివృద్ధి చేస్తానన్న విశ్వనగరంలో.. ఆరేండ్లు అయినా నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉంది. అభివృద్ధి పేరుతో మేఘాకు, మీ బంధువులకు కాంట్రాక్టులు, కమీషన్లు కేటాయించడంలో ఉన్న శ్రద్ధ ప్రజల మీద మీకు లేకపాయే!’ అని పేర్కొన్నారు. 

వర్షాలతో ఇండ్లు, కాలనీలు మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలను ఆదుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు.

ఆరేండ్ల కింద నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో రాజ్ భవన్, సీఎం కార్యాలయం కూడా నీటిలో మునుగుతదా? అంటూ కోటలు దాటేలా మాట్లాడవ్, కానీ ఇవ్వాళ నీ అభివృద్ధి కనీసం ప్రగతి భవన్ కూడా దాటలేదని మండిపడ్డారు.

2015లో జరిగిన  జీహెచ్ఎంసీ   ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్‌ను 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్త అన్నావ్ కదా కేటీఆర్.. ఇవ్వాళ  జీహెచ్ఎంసీ  లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి చూసి ప్రజలకు సమాధానం చెప్పు?’ అని నిలదీశారు.