నకిలీ పట్టాలతో రూ 11 కోట్లకు టోకరా 

నకిలీ పట్టాలతో రూ.11 కోట్లకు టోకరా పెట్టిన వైనం విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వైసిపి నాయకుడి కుమారుడొకరు ఓ బ్యాంకు నుంచి జీడిపిక్కల ఉత్పత్తిదారుల (రైతులు) పేరిట నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలను సృష్టించి ఏకంగా రూ.11 కోట్లు కొల్లగొట్టాడు. 
 
విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఎఎల్‌ పురానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కుమారుడు జీడిపిక్కల కమిషన్‌ వ్యాపారం చేస్తున్నాడు. అనకాపల్లిలో ఒక గోదాము నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2017లో అనకాపల్లిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాను సంప్రదించాడు. 
 
గొలుగొండ మండలంలో 16 మంది రైతులకు చెందిన జీడిపిక్కలు అనకాపల్లి గోదాములో నిల్వ ఉన్నట్లు చూపించి ఏకంగా రూ.11 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇందులో సుమారు రూ.కోటి వరకూ తిరిగి చెల్లించినట్లు తెలిసింది. మిగిలిన బకాయిలు చెల్లించకపోవడంతో జీడి పిక్కల గోదామును సీజ్‌ చేశారు. 
 
అంతేకాకుండా రుణ మంజూరుకు తనఖాగా పెట్టిన 16 మంది రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాల వివరాలను గొలుగొండ మండల రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పంపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలని కోరారు.
 
దీంతో ఆర్‌ఐ, వీఆర్వోలు రెండు, మూడు రోజులుగా పాతమల్లంపేట, ఎఎల్‌పురం, క ష్ణాదేవిపేట గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. అయితే పట్టాదారు పాస్‌పుస్తకాల్లో నమోదైన పేర్లు, సర్వే నంబర్లు, రెవెన్యూ గ్రామాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. 
 
అనకాపల్లి బ్యాంకులో తాము ఎలాంటి రుణమూ తీసుకోలేదని రైతులు చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు వైసిపి నేత కుమారుడి నకిలీ బాగోతం వెలుగు చూసినట్లుగా చెప్పుకొంటున్నారు.