హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు,  అశ్వనీదత్‌

రాజధానిలోని తమ భూములకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ.. సినీనటుడు కృష్ణం రాజు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ ఎపి హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సినీనటుడు కృష్ణం రాజు కోరారు.

గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించారు.

పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏఏఐ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ తన భూమి విషయంలో ఎపి హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సిఆర్‌డిఎ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్‌ తెలిపారు.

తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని తెలిపారు.

భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఎపి ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వనీదత్‌ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు.