ఆరోగ్య మంత్రి ఈటెల పేషీలో ఏడుగురికి కరోనా

ఆరోగ్య మంత్రి  ఈటల రాజేందర్‌‌ పేషీలోనే ఏడుగురికి కరోనా సోకింది. ఇద్దరు పీఏలు, ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్​మెన్లకు ఒకేసారి పాజిటివ్ రావడంతో మంత్రి కార్యాలయాన్ని శానిటైజ్ చేయించారు. మిగిలిన సిబ్బంది కూడా టెస్టులు చేయించగా.. అందరికీ నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మంత్రి ఈటల కూడా టెస్టు చేయించుకోగా నెగెటివ్‌‌ వచ్చినట్టు తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.67 లక్షలు దాటింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 50,634 మందికి టెస్టులు చేస్తే2,043 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ బులెటిన్​లో వెల్లడించింది.

అందులో గ్రేటర్‌‌‌‌  హైదరాబాద్‌‌ పరిధిలో 314, జిల్లాల్లో 1,729 కేసులు నమోదయ్యాయని తెలిపింది.కరోనాతో గురువారం మరో 11 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 1,016కు చేరిందని బులెటిన్​లో తెలిపారు.

కాగా, ఏపీలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 74,710 శాంపిల్స్ టెస్టు చేయగా 8,096 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 67 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,244కు పెరిగింది.