రాజా సింగ్ ఫేస్‌బుక్ ఖాతాపై నిషేధం  

గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి.రాజా సింగ్  వ్య‌క్తిగ‌త ఖాతాపై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ  ఫేస్‌బుక్ నిషేధం విధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల విద్వేష ప్రసంగాల విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదని  ఫేస్‌బుక్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించిన విషయం తెలిసిందే.

రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా రాజా సింగ్ అకౌంట్ ను  ఫేస్‌బుక్ నిషేధించింది. కంటెంట్ ప్రమోషన్ లోని విద్వేషం, హింస అనే పాలసీలను అతిక్రమించినందుకు ఆయన అకౌంట్ ను తొలగించామని  ఫేస్‌బుక్   అధికార ప్రతినిధి తెలిపారు.

హింసను ప్రేరేపించే విద్వేషపూరిత విషయాలను తమ ప్లాట్ ఫామ్ లో ప్రమోట్ చేసినందుకు గాను రాజా సింగ్ అకౌంట్ ను తమ కంపెనీ పాలసీ ప్రకారం నిషేధించామని సదరు అధికారి చెప్పారు. ఇదిలా ఉంచితే తనకు అసలు  ఫేస్‌బుక్  పేజీ లేదని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో రాజా సింగ్ సుస్పష్టం చేశారు. 

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ ప్యానెల్ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఫేస్‌బుక్  ఫేస్ బుక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పక్షపాత వైఖరిని ఎందుకు అవలంభిస్తున్నారంటూ  ఫేస్‌బుక్   అధికారులను థరూర్ ప్రశ్నించారు.