గవర్నర్ పై టీఆర్ఎస్ విమర్శలపై బిజెపి మండిపాటు 

కరోనా కట్టడికి చేసిన సూచనలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పినందుకు గవర్నర్ డా.తమిళసై సౌందర్యారాజంపై టీఆర్ఎస్ ఎమ్యెల్యే సైదారెడ్డి తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న విమర్శల పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు. 

మంచి సూచనలు చేస్తే తప్పుపడతారా అంటూ రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని హైకోర్టు చాలాసార్లు ఆదేశించిందని.. మరి హైకోర్టును కూడా బీజేపీ కోర్టు అంటరా అని ప్రశ్నించారు. గవర్నర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

గవర్నర్పై తప్పుగా కామెంట్ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, దీనిపై సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో విఫలమైన టీఆర్ఎస్ సర్కారు తన తప్పులను సరిచేసుకోవాల్సింది పోయి గవర్నర్ ను టార్గెట్ చేయడం సరికాదని హితవు చెప్పారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ ఆయన అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమా చెప్పాలని ఎమ్మెల్సీ రాంచంద్రరావు డిమాండ్ చేశారు.  తమిళిసై సూచనలను రాష్ట్ర సర్కారు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు పాజిటివ్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కరోనా కట్టడిలో విఫలమైన కేసీఆర్ సర్కారుకు గవర్నర్ చీవాట్లుపెట్టడాన్ని స్వాగతిస్తున్నామ ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. డాక్టర్ అయిన గవర్నర్.. రాష్ట్ర సర్కారు సరిగా వ్యవహరించకపోవడాన్ని ఎత్తిచూపారని చెప్పారు.