నేల రోజుల్లో 5గురు కాశ్మీర్ బీజేపీ నేతల హతం

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని బీజేపీ నేతల్లో ప్రాణ భయం పట్టుకుంది. నెల రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఆరుగురిపై దాడులు జరుగగా, ఐదుగురు మరణించారు. 
 
జూలై 8న బీజేపీకి చెందిన బందిపొరా నేత వసీం బారితో పాటు ఆయన తండ్రి బషిర్ షేక్, సోదరుడు ఉమర్ షేక్ హత్యకు గురయ్యారు. ఆగస్టు 4న దక్షిణ కశ్మీర్ లోని అఖారన్ పంచాయతీకి చెందిన బీజేపీ సభ్యుడు ఆరిఫ్ అహ్మద్‌పై దుండగులు కాల్పులు జరుపగా అతడి పరిస్థితి సీరియస్ గా ఉన్నది. 
 
ఆగస్టు 6న ఖాజీ‌గుండ్ ప్రాంతంలో బీజేపీ నేత, సర్పంచ్ అయిన సాజిద్ ఖాండేను ఆయన ఇంటి బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. ఆగస్టు 9న బుద్గామ్‌లోని ఓంపారాలో బీజేపీ నేత అబ్దుల్ హమీద్ నాజర్ హత్యకుగురయ్యారు. 
 
స్థానిక సంస్థలకు చెందిన బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తుండటంతో వారిలో భయం నెలకొన్నది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా తమకు రక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని పాలక యంత్రాంగాన్ని వారు కోరుతున్నారు.
 
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని వర్తింపజేసే ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
 
ఇది జరిగి ఏడాదైన సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా మరోవైపు స్థానిక బీజేపీ నేతలు వరుసగా హత్యకు గురవుతున్నారు.