లడఖ్ సరిహద్దుపై రాత్రివేళ రాఫెల్ నిఘా

భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఇటీవల కొత్తగా చేరిన అత్యాధునిక ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి. అత్యాధునిక బాంబులు కలిగిన ఇవి హిమాచల్ ప్రదేశ్‌లోని గగన తలం నుంచి పూర్తిస్థాయి విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. 

లడఖ్‌‌లోని చైనా సరిహద్దులో 1,597 కిలోమీటర్ల మేర విస్తరించిన వాస్తవాధీన రేఖపై కన్నేసి ఉంచాయి. ఆక్రమిత అక్సాయ్ చిన్‌లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఆ దేశ రాడర్ల సిగ్నల్స్‌ను గుర్తిస్తున్నాయి. ప్రతికూల సమయంలో ఆ సిగ్నల్స్‌ను జామ్ చేసి మెరుపుదాడులు చేసే విన్యాసాలను చేపడతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రాఫెల్స్‌ను కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తొలి విడతగా ఐదు రాఫెల్స్ జూలై 29న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 18ని అంబాలా ఎయిర్‌బేస్‌లో, మరో 18ని భూటాన్ సరిహద్దులోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు.