భారత వాయుసేనకు ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్లు  

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత వాయుసేన తన బలాన్ని మరింత పెంచుకోవడంలో బిజీగా మారింది. మిలిటరీకి చెందిన ఇజ్రాయెల్ డ్రోన్ హెరాన్ యూఏవీని మరింత శక్తివంతం చేయడానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు.

శత్రు లక్ష్యాలు, సాయుధ రెజిమెంట్ల కోసం లేజర్-గైడెడ్ బాంబులు, ప్రెజర్-గైడెడ్ మందుగుండు సామగ్రి, యాంటీ ట్యాంక్ క్షిపణులతో హెరాన్‌ను సిద్ధం చేయడానికి సైన్యం సిద్ధమవుతున్నది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు ప్రతిపాదనను సైన్యం మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ.3500 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్ మూడు సైన్యాల నుంచి 90 హెరోన్ డ్రోన్లను లేజర్-గైడెడ్ బాంబులు, క్షిపణులతో అప్‌గ్రేడ్ చేస్తుందని తెలుస్తున్నది. 

రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌తో పాటు ఉన్నత స్థాయి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్లు చైనా యొక్క సైన్యం చేపట్టే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటా వారిని వెనక్కి వెళ్లేలా చేయగలదని సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం కదలికను ఎప్పటికప్పుడు కనిపెడుతూ బహిర్గతం చేస్తాయని పేర్కొన్నారు. 

మూడు సైన్యాలు గత కొన్నేళ్లుగా హెరోన్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇది ఒకేసారి రెండు రోజులపాటు ఎగురుతుంది. అలాగే 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి శత్రువు ప్రతి కదలికను పర్యవేక్షించే సామర్ధ్యం కలిగివుండటం దీని ప్రత్యేకత.