రాజమౌళికి కరోనా పాజిటివ్‌  

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. టాలీవుడ్‌లో కరోనా బారిన పడిన తొలి దర్శకుడు రాజమౌళినే కావడం గమనార్హం.

కొద్దిరోజులుగా తనకు, తన కుటుంబ సభ్యులకు స్వల్పంగా జర్వం ఉందని.. దీంతో కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ వచ్చిన కరోనా రిజల్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాజమౌళి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

తమ కుటుంబం కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని ట్వీట్‌లో రాజమౌళి వెల్లడించారు. అయినప్పటికీ.. వైద్యుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. అయితే మాకు ఈ రోజు కొద్దిపాటి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం’ అని తెలిపారు. 

పైగా ‘ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి వివరించారు