కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్ఛితంగా చేర్చుకోవాలి

కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్  ప్రైవేటు ఆసుపత్రుల  యాజమాన్యాలకు తేల్చి చెప్పారు. అంతేకాదు నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని గవర్నర్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ తమిళ సై వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 11 ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నాయి. కరోనా కల్లోలంతో భయాందోళనలు పెరిగిపోతున్న దృష్ట్యా అనేక కారణాలతో  ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆమె  సూచించారు. 
 
కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందటంలేదన్న ఫిర్యాదులను ఆమె ప్రస్తావిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే పాజిటివ్ రోగులకు భరోసా కల్పించాలని ఆమె పేర్కొన్నారు. పాజిటివ్ బాధితులు ఆసుపత్రులకు రాగానే కచ్చితంగా చేర్చుకోవాలని, నాలుగైదు ఆసుపత్రులు  తిరిగే పరిస్థితి రాకూడదని గవర్నర్ హెచ్చరించారు. 
 
అలాగే టెస్టులు బాధ్యతతో చేయాలని, అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల సహకారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగుల నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.