వాణిజ్యశాఖ అధికారిణిగా సంతోషిని  

గాల్వాన్ వాలీ లో చైనా సేనల దాడులను విజయవంతంగా తిప్పికొడుతూ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషిని వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా  ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు.

ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సంబంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేతనం రూ. 40,270 నుంచి రూ. 93,780 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే, సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది.

మరోవంక, సంతోషికి బంజారాహిల్స్ ‌లో 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 59ను సిఎస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6/1, వార్డు నంబర్ 10, రోడ్డు నంబర్ 14 బంజారాహిల్స్‌లో కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.