కేంద్ర బలగాల రక్షణ కోరిన వైసిపి ఎంపీ 

వైసిపి నాయకత్వంపై తిరుగుబాటు ధోరణులు ప్రదర్శిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా తనకు ప్రాణహాని ఉన్నదని పేర్కొంటూ, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ నేరుగా లోక్‌సభ స్పీకర్‌కు జిల్లా ఎస్పీలకు మొరపెట్టుకున్నారు. 
 
తనను చంపుతామని కొందరు వ్యక్తులు బెరిరిస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వ్రాసిన లేఖలో ఆరోపించారు. తనను చంపేస్తామని బెదిరించిన వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదంటూ  ఈ లేఖలో పేర్కొన్నారు.  స్పీకర్‌కు రాసిన లేఖనే  కేంద్ర హోంమంత్రికి కూడా పంపినట్లు తెలుస్తున్నది. 

అంతకుముందు రఘురామకృష్ణంరాజు పశ్చిమగోదావరి  జిల్లా ఎస్పీకి కూడా లేఖ వ్రాసిన లేఖలో నాలుగు పోలీస్ స్టేషన్ల అధికారులపై ఫిర్యాదు చేశారు. నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు. ఎంపీని అసభ్య పదజాలంతో దూషించి, దిష్షిబొమ్మలు దగ్ధం చేసిన వారిపై ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్‌స్టేషన్లలో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పేర్కొన్నారు.

ఇటీవల వైపీసీ ఏడాది పాలనపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారితో మాట్లాడిస్తున్న వారెవ్వరో తెలుసని అంటూ నేరుగా పార్టీ అధినాయకత్వంపైననే విరుచుకు పడ్డారు.  సీఎం జగన్‌తో భేటీకి సమయం అడిగితే  చాలాకాలంగా ఇవ్వడం లేదని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. 

పైగా, దయచేసి కులాలమధ్య చిచ్చుపెట్టవద్దని వేడుకుంటున్నానని అంటూ పరోక్షంగా పార్టీ నాయకత్వం లక్ష్యంగా విమర్శలక్లు దిగారు. మరోవంక ఏపీ రాజధాని విషయంలో కూడా పార్టీ నాయకత్వం ధోరణిని తప్పు బాదుతూ 

రాజధాని నగరం అమరావతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. 

అదీగాక,  వైసిపి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణి కోసం స్థలాల సేకరణలో అవినీతి  జరిగిన్నటు కూడా ఆరోపించారు. ఆయన నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎమ్యెల్యేలు మినహా పార్టీ సీనియర్ నేతలు ఎవ్వరు ఆయన వ్యవహారంపై స్పందించక పోవడం విస్మయం కలిగిస్తున్నది. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ఎమ్యెల్యేలు డిమాండ్ చేశారు.