నీళ్ల పేరిట రెండు రాష్ట్రాల సీఎంల దోపిడీ 

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం మాఫీయాలాగా ఒకటై,  సీఎం కేసీఆర్, నీళ్ల పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు జరగలేదని ధ్వజమెత్తారు.

ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డాయిరు. వాళ్ల కుటుంబం కోసమే పదవీ విరమణ పెంపు జీవో తెప్పించారని ఆరోపించారు. 50 శాతం జీతాలు కట్ చేసినా, ఐఆర్ ఇవ్వకపోయినా కొందరు నేతలు మాట్లాటం లేదని దుయ్యబట్టారు. స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు తాకట్టు పెట్టారంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి, ఆరేళ్లుగా భయటకే రావడం లేదంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఐసోలేషన్ లో డాక్టర్లకు సరైన రక్షణ కల్పించాలంటూ రెండు సార్లు వెళ్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని తెలిపారు. గాంధీ ఆస్పత్రి సహా అనేక ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేక డాక్టర్లు కరోనా భారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టులు సరిగా లేకపోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు.

కొండ పోచమ్మ చెరువు నుంచి ఒక్క ఎకరానికైనైనా నీళ్లిచ్చారా అని కేసీఆర్ ను సంజయ్ ప్రశ్నించారు. వర్షం పడితే పూలు చల్లి కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏ భూమిలో ఏ పంట పెడుతుందో రైతులకు మాత్రమే తెలుసునని, కానీ ఫాం హౌస్ ఉన్న సీఎం తాను చెప్పిన పంటలే వేయాలంటున్నాడని విస్మయం వ్యక్తం చేశారు. పంటలకు కలిగే నష్టాలకు పూర్తి భాద్యత తనదేనని సీఎం  హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే కటకం మృత్యుంజయం  సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.