ఈ పిటిషన్లపై విచారణలో పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీఆర్డీఏ మాస్టర్ప్లాన్ ప్రకారం పెట్టుబడులతో వచ్చే ఐటీ కంపెనీల కోసం కేటాయించిన ప్రాంతాన్ని విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్-5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టానికి సవరణ కూడా చేసింది. అమరావతి ప్రాంతంలో మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని 1134 ఎకరాలను నివాస ప్రాంతంగా మార్చి ఆర్-5 జోన్గా ఇటీవల గెజిట్ విడుదల చేసింది.
ఆర్-5 జోన్ పై అమరావతి రైతులు అభ్యంతరం తెలుపుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పు ప్రకారం ఇళ్ల స్థలాల కేటాయింపు ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మొదలుపెట్టింది.
రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో 107 జీవో జారీ చేసింది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని పేదలందరికీ ఇళ్లు కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే ఈ జీవోను గతంలో హైకోర్టు సస్పెండ్ చేసింది. జోనల్ రెగ్యులేషన్కు ఈ జీవో విరుద్ధమని, జోనల్ పరిధిని కుదించడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్ -5 జోన్ తీసుకువచ్చింది. రాజకీయ అజెండాలో భాగంగా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరణ చేసిందని రైతులు వాదిస్తున్నారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్