ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆవుల‌ప‌ల్లి, ముదివీడు, నేతిగుంట‌ప‌ల్లి రిజర్వాయర్ల నిర్మాణాల‌ విషయంలో సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాక‌రించింది.  చిత్తూరు జిల్లాలోని ఆవుల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తిని ఎన్జీటీ కొట్టి వేసి రూ. 100 కోట్ల జరిమానా విధించింది.

అయితే, ఎన్టీజీ ఆదేశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ సర్కారు పిటిషన్ పై జ‌స్జిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సుంద‌రేశ్ల‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం త‌ర‌పున సీనియర్ న్యాయ‌వాది ముకుల్ రోహత్గీ వాద‌న‌లు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, ఎన్జీటీ రూ.100 కోట్ల జ‌రిమానా విధించ‌వ‌చ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా స్టే విధించింది.

ఎన్జీటీ రూ.100 కోట్లు జ‌రిమానా విధించ‌డం చ‌ట్టబ‌ద్ధం కాద‌ని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దాంతో ప్రాజెక్టుల‌ను మీకు అనుకూలంగా విడ‌గొట్టడం ఎలా చ‌ట్టబద్ధమని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని అంత జ‌రిమానా భారం అవుతుందని తెలిపారు. రూ.100 కోట్ల జ‌రిమానా నిలుపుద‌ల చేయాల‌ని కోర్టును కోరారు.

దీంతో ప్రస్తుతానికి  ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జ‌రిమానాలో ముందుగా రూ.25 కోట్లను వెంట‌నే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాల‌ని  జ‌స్జిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సుంద‌రేశ్ల‌తో కూడిన ధర్మాసనం ఏపీ సర్కారును ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్కు వాయిదా వేసింది.