టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం జరిగిన హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వివిధ పారాయణాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు.

గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందజేస్తామని పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ఇలా ఉండగా, దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి తిరుమలకు వాహనాల్లో, నడక మార్గాల ద్వారా విచ్చేస్తున్న భక్తుల యాత్రానుభవాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని సమావేశం నిర్ణయ్హించింది. ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ ఉన్నందున ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించాలని, యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి ‘అదివో అల్లదివో’ లాంటి కార్యక్రమాలను కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రసారం చేయాలని నిర్ణయించారు.

టీటీడీ అందిస్తున్న ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను సాధారణ ప్రజలకు తెలిసేలా స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యకలాపాలను ప్రసారం చేయాలని, అలాగే పలు వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలను నిపుణులైన డాక్టర్లతో ఇప్పించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని కూడా నిర్ణయించారు.