ఏర్పాట్లు లేకుండా విద్యాలయాలు తెరవడంపై ఆందోళన 

 ఫిబ్రవరి 1 నుంచి విద్యాలయాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడమే గానీ, ఆ నిర్ణయాల అమలుకు తగిన ఏర్పాట్లు చేయ్యడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉందంటూ ఆమె విమర్శలు గుప్పించారు. 
 
పరిస్థితులు కాస్తో కూస్తో బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. సోమవారం తన ఫేక్‌బుక్ అధికారిక ఖాతా ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడమే గాని.. ఆ నిర్ణయాల అమలుకు తగిన ఏర్పాట్లు చెయ్యడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ కొన్ని తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది గానీ, కోవిడ్ నిబంధనల్ని పాటించే పరిస్థితులు లేవని ఆమె స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో వందలాది పాఠశాలలను మరుగుదొడ్ల సమస్య, నీటి సమస్య వేధిస్తున్నాయి. ఈ పరిస్థితి అబ్బాయిల కంటే అమ్మాయిలకు మరింత మరింత సమస్యగా పరిణమిస్తుంది. తాజాగా గణాంకాలతో సహా మీడియాలో కథనాలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. కరోనా వ్యాప్తికి ముందే ఈ సమస్యలున్నా తెలంగాణ సర్కారు ఏనాడూ దీనిపై దృష్టి సారించలేదని విజయశాంతి విమర్శించారు. 
 
ఫలితంగా బాలికల డ్రాపౌట్ల సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటికి తోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా ఉంది. అప్పుడే ఏమీ చెయ్యని ఈ అసమర్ధ, అవినీతి ప్రభుత్వం ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో చేతులెత్తెయ్యడం తప్ప ఈ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న ఆశలు ఏ మాత్రం లేవు. మరోవైపు కాలేజీల్లో లెక్చరర్ల కొరత, హాస్టల్ సదుపాయాల్లో ఇబ్బంది లాంటి మరి కొన్ని సమస్యలున్నాయని ఆమె వివరించారు. 
 
 పరిస్థితులు కాస్తో కూస్తో బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు. ఏ సమస్య వచ్చినా చేతులు ముడుచుకు కూర్చునే టీఆరెఎస్ సర్కారుకు కాలం చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించాలని విజయశాంతి తన ఫేక్‌బుక్‌ ఖాతాలో హితవు చెప్పారు.