నటుడు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఫిర్యాదు

నటుడు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఫిర్యాదు

నటుడు ప్రకాశ్ రాజ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. హిందూ సమాజాన్ని తీవ్రంగా కించపరిచేలా, వివిధ కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన నిరంతరం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు పోలీసులను ఆశ్రయించారు. బీజేపీ జాతీయ మండలి సభ్యుడు ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు ప్రకాశ్ రాజ్‌పై కదిరి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దీనిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను సోషల్ మీడియా వేదికగా, ఇతర రూపాల్లో అవమానించేలా జరుగుతున్న చర్యల వెనుక ప్రకాశ్ రాజ్ ప్రోద్బలం, హస్తం స్పష్టంగా ఉన్నాయని  ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు,

వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్‌కు, అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ హిందూ సమాజాన్ని అవమానిస్తున్న ప్రకాశ్ రాజ్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఈ విషయంలో తమ వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ ఆయా రాజకీయ పార్టీలు, నటుడు ప్రకాశ్ రాజ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న ప్రకాశ్ రాజ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు పోలీసులను కోరారు. కేవలం ప్రకాశ్ రాజ్ మాత్రమే కాకుండా, ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తులు, దేశ వ్యతిరేక శక్తులపై కూడా కూలంకషంగా చట్టపరమైన విచారణ జరిపి, బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.