ఎల్టీటీఈ మాజీ నేతకు నివాళులతో వివాదంలో సీఎం విజయ్

ఎల్టీటీఈ మాజీ నేతకు నివాళులతో వివాదంలో సీఎం విజయ్
* తండ్రిని చంపిన ప్రభాకరన్ కు నివాళులు రాహుల్ సమర్థిస్తారా?… నిలదీసిన బిజెపి 

నిషేధిత వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ వర్ధంతి నాడు తమిళనాడు ముఖ్యమంతిర్ జోసెఫ్ విజయ్ చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ దుమారం రేపింది. ఈ విషయంలో కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీయే కారణమని, దీనిని ఆయన సమర్దిస్తారా? అని ప్రశ్నించింది. 

అయితే, విజయ్ వైఖరిని తమిళగ వెట్రి కజగం వర్గాలు సమర్దించాయి. ఆయన ప్రస్తావన కేవలం ప్రభాకరన్ మరణం గురించి మాత్రమే కాదని, శ్రీలంకలో వేలాది మంది తమిళుల ఊచకోత గురించి అని వివరణ ఇచ్చాయి. ఈ విషయంలో టీవీకే ప్రభుత్వంలో మిత్రపక్షమైన కాంగ్రెస్ మౌనంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ విజయ్ చర్యను సమర్దించనూ లేదు, అలాగని ఖండించలేదు. ఇది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమనే చెప్పాలి.
 
శ్రీలంక సైన్యం 2009 మే 18న ముల్లివైక్కల్‌లో ప్రభాకర్‌ను కాల్చి చంపింది. ముల్లివైక్కల్‌ పేరును ప్రస్తావిస్తూ విజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ‘‘ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మనం మన హృదయాలలో పదిలపరుచుకుంటాం. సముద్రం అవతల నివసిస్తున్న మన తమిళ బంధువుల హక్కుల కోసం మనం ఎల్లప్పుడూ సంఘీభావంతో నిలబడతాం!’’ అని ఆయన పోస్టు చేశారు. 
 
దీంతో బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డారు. రాజీవ్ గాంధీ హత్య వెనుక ఎల్టీటీఈ పాత్రను ఆయన గుర్తుచేశారు. ‘‘మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్యచేసిన నిషేధిత సంస్థ ఎల్టీటీఈ మాజీ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌కు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నివాళులర్పించారు. వాస్తవానికి కాంగ్రెస్‌కు అధికారంలో వాటా దక్కేంత వరకు రాహుల్ గాంధీకి ఎలాంటి సమస్య ఉండదు. పైగా, డీఎంకే కూడా ఎల్టీటీఈని సమర్థించే పార్టీయే. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ పొత్తులో ఎంతో సౌకర్యంగా ఉంది’’ అని ఆరోపించారు.

రాజీవ్ గాంధీ హత్య అనంతరం భారత్‌లో ఎల్‌టీటీఈపై నిషేధం విధించారు. దీంతో సాధారణంగా తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీలు ప్రభాకరన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వవు. కానీ, విజయ్ ‘ముల్లివైక్కల్’’ సంస్మరణ దినం రోజు నివాళులర్పించడం గమనార్హం. ఎల్టీటీఈ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించే వీసీకే మద్దతుతోనే ఆయన మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతోంది.