రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. తమ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి వచ్చే అవకాశం ఉందని రష్యా, చైనా పక్షాలు న్యూఢిల్లీకి తెలియజేసినట్లు తెలిసింది. పుతిన్ పాల్గొనే విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ నిర్ధారిస్తూ ప్రపంచంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో ఇది కీలక దౌత్య కలయికగా పేర్కొన్నారు.
దీని కారణంగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత విస్తరిస్తుందని భావిస్తున్నారు. రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం, పుతిన్ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో జిన్పింగ్ పాల్గొనడం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యటన అని వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 2019లో చెన్నై సమీపంలోని మామల్లాపురంలో జరిగిన భారత్-చైనా నాయకుల రెండవ అనధికారిక శిఖరాగ్ర సమావేశం తర్వాత ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2020 ఏప్రిల్-మే నెలల్లో సరిహద్దు ప్రతిష్టంభన ప్రారంభమైన తర్వాత భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.
2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, షీలు సమావేశమైన తర్వాత సంబంధాల స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సమావేశంలోనే తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వద్ద సైనిక ఉపసంహరణను పూర్తి చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. గత ఏడాదిన్నర కాలంలో, ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసాల పునరుద్ధరణ, చైనా సంస్థలపై ఆంక్షల సడలింపు, కైలాష్ మానసరోవర్ యాత్ర పునరుద్ధరణ వంటి అంశాలతో సంబంధాలను స్థిరీకరించడంలో భారత్, చైనాలు గణనీయమైన పురోగతి సాధించాయి.
అయినప్పటికీ, 50,000 మందికి పైగా సైనికులు ఎల్ఏసి వెంబడి మోహరించి ఉన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడం, సైనిక ఉపసంహరణ ప్రక్రియ ఇంకా జరగలేదు. ఊహించని పరిణామాలు ఏవీ తలెత్తకపోతే, అత్యున్నత స్థాయిలో చర్చలు జరపాలని న్యూఢిల్లీకి తెలియజేశారు. వేదికను ఇంకా ప్రకటించనప్పటికీ, శిఖరాగ్ర సమావేశానికి న్యూఢిల్లీలోని భారత్ మండపాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత వారం న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో నాయకుల శిఖరాగ్ర సమావేశపు అజెండాపై చర్చించారని, చర్చించాల్సిన పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆ వర్గాలు తెలిపయి. ఈ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొనగా, జిన్పింగ్ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగే అత్యంత కీలకమైన సమావేశం కోసం బీజింగ్లో ఉండాల్సి వచ్చినందున చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హాజరు కాలేకపోయారు.
భారతదేశంలో చైనా రాయబారి ఎక్స్యు ఫెయిహాన్గ్ చైనా తరపున ఈ సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమ ఆసియా యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలతో విడిపోయిన బ్రిక్స్ దేశాలు, శిఖరాగ్ర సమావేశం నాటికి ఒక ఉమ్మడి ఏకాభిప్రాయానికి చేరుకోవాలని భారత ప్రభుత్వం కూడా ఆశిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పశ్చిమ ఆసియా యుద్ధానికి సంబంధించి దౌత్యపరమైన భాషపై గత వారం జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఎటువంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ కూటమిలో సభ్య దేశాలైన ఇరాన్, యూఏఈల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను సమతుల్యం చేసే ప్రయత్నంలో భారతదేశం ఒక ‘అధ్యక్ష ప్రకటన’ను విడుదల చేసింది.

More Stories
పవర్ టూల్స్ రంగంలో భారత ఆత్మనిర్భరత
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
అణ్వాయుధాలలో పాకిస్థాన్ ను అధిగమించిన భారత్