అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం నుంచి ప్రభుత్వం ప్రజల్ని నిరంతరం రక్షించలేదన్నారు. నిరంతరం ధరల పెరుగుదల కొనసాగితే, ప్రభుత్వం దేశంలో పెట్రో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు ఎంతో సమయం పట్టదని స్పష్టం చేశారు. ఇప్పటికే చమురు ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. ఆయిల్ కంపెనీల నష్టాలను ప్రభుత్వం భరిస్తూ వస్తోందని, ధరల్ని అదుపులో ఉంచుతోందని వెల్లడించారు.
అయితే, ప్రభుత్వం ఎంతకాలం ఈ పని చేయగలదనేది సందేహమని మల్హోత్రా పేర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందని, దీంతో వడ్డీ రేట్లు, వినియోగదారుల ఖర్చులు, రవాణా వ్యయం వంటి అంశాలపై ప్రభావం పడొచ్చని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారి కాలంలో జీడీపీలో 9.2 శాతంగా ఉన్న ద్రవ్య లోటును దాదాపు 4.3 శాతానికి తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించిందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిందని మల్హోత్రా తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులో ఉంచడానికి ద్రవ్య విధానం ముఖ్యమైనదని చెప్పారు.
అయితే అది ఒక్కటే ప్రధాన సరఫరా-సరుకు లోటు సమస్యలను ఎదుర్కొనడానికి సరిపోకపోవచ్చని ఆయన తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని, నిరంతర అనిశ్చితుల మధ్య పనిచేయడానికి కేంద్ర బ్యాంకులు అలవాటు పడ్డాయని మల్హోత్రా చెప్పారు. ఆర్థిక నమూనాలు, మారుతున్న ప్రవర్తనా విధానాలు, అందుబాటులోకి వచ్చే డేటాకు సంబంధించిన అనిశ్చితులను ద్రవ్య విధానం క్రమం తప్పకుండా ఎదుర్కొంటుందని తెలిపారు.
అందుకే తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయాల్లో పాలసీదారులు అత్యంత ఖచ్చితమైన నిర్ణయాల కోసం చూడకుండా, జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపు చేయడానికి ఇలాంటి పరిస్థితుల్లో క్రమబద్ధత, పాలసీ కమ్యూనికేషన్, కేంద్ర బ్యాంక్ స్వయంప్రతిపత్తి మరింత ముఖ్యమైనవని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఆ ప్రాంతంపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా మల్హోత్రా ప్రస్తావించారు. భారతదేశ మొత్తం దిగుమతులలో ఆరో వంతు ఆ ప్రాంతం నుంచే వస్తుండగా, ఎగుమతులలో ఆరో వంతు అక్కడికే వెళ్తున్నాయని ఆయన చెప్పారు. దీనికి తోడు, విదేశాల నుంచి వచ్చే నిధులలో దాదాపు 40 శాతం, ఎరువుల దిగుమతులలో 40 శాతం, గ్యాస్ సరఫరాలో దాదాపు 60 శాతం ఆ ప్రాంతంతోనే ముడిపడి ఉన్నాయని, ఇది ఆ ప్రాంత పరిణామాలకు భారతదేశాన్ని ఎంతగానో గురిచేస్తుందని వివరించారు.

More Stories
విమాన ఇంధన ధరల స్థిరత్వానికి రూ.10 వేల కోట్ల ఇంధన నిధి
భారత్ సహా 54 దేశాలపై అమెరికా 12.5శాతం అదనపు సుంకం
58 మంది టిఎంసి ఎమ్యెల్యేల తిరుగుబాటు.. ప్రతిపక్ష నేతగా రితబ్రత