మోదీపై అభ్యంతరకర పోస్టులపై ఎఫ్‌ఐఆర్

మోదీపై అభ్యంతరకర పోస్టులపై ఎఫ్‌ఐఆర్

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకరమైన, దురుద్దేశపూర్వకమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదిక ఎక్స్ కు పోలీసులు లేఖ రాశారు.

స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) యూనిట్ కూడా ఖాతాదారుల పూర్తి వివరాలను అందించాలని ఎక్స్ ను కోరింది.  అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించడంతో పాటు వాటిని అప్‌లోడ్ చేసిన ఖాతాల యజమానుల పూర్తి వివరాలను అందించాలని ఎక్స్‌ను ఢిల్లీ పోలీసులు కోరారు. ఆయా వ్యక్తుల పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పాటు లాగిన్, లాగ్‌అవుట్ వివరాలు, తేదీ, సమయ సమాచారాన్ని కూడా సమర్పించాలని సూచించారు.

దర్యాప్తు, భవిష్యత్తులో జరిగే న్యాయపరమైన విచారణల కోసం సంబంధిత పోస్టులకు సంబంధించిన అన్ని డేటాను భద్రపరచాలని కూడా ఎక్స్‌కు పోలీసులు ఆదేశించారు. అలాగే ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన భారతీయ సాక్ష్యాధినియమం సెక్షన్ 63(4) ప్రకారం అవసరమైన ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని కోరారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయనే నివేదికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

నిరసనలు ముగిసిన అనంతరం, అలాగే సంసద్ చలో మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల సమయంలో ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న పోస్టులను తొలగించాలని ఢిల్లీ పోలీసులు పలు సోషల్ మీడియా వేదికలను ఆదేశించారు. ఇంతకుముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, నిరసనల సమయంలో డీప్‌ఫేక్ వీడియోలు, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో రూపొందించిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినట్లు భావిస్తున్న సుమారు 500 సోషల్ మీడియా ఖాతాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

వార్తా సంస్థ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంటెంట్ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశముందా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇం దుకోసం ఢిల్లీ పోలీసుల సోషల్ మీడియా మానిటరింగ్ బృందం వివిధ ఇంటర్నెట్ వేదికలను నిరంతరం పరిశీలిస్తూ అనుమానాస్పద పోస్టులను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు పంపిన నోటీసులలో ఒకదానిలో, “ఇటువంటి అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్ వ్యాప్తి ప్రధానమంత్రి ప్రతిష్టకు, గౌరవానికి, ప్రజా ప్రతిబింబానికి తీవ్ర నష్టం కలిగించింది” అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 

“ఇటువంటి కంటెంట్ నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల ప్రజా శాంతికి భంగం కలగవచ్చు, అనవసరమైన రాజకీయ వివాదాలు సృష్టించవచ్చు మరియు ప్రజా విశ్వాసం దెబ్బతినవచ్చు. ఇటువంటి చర్యలు పరువు నష్టం, అభ్యంతరకరమైన కంటెంట్, సైబర్ నేరాల కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేయడానికి కూడా దోహదపడతాయి.” 
 
“అందువల్ల ఈ సమాచారం అందిన మూడు గంటలలోపు, పైన పేర్కొన్న ఖాతాలు, యుఆర్ఎల్ లను తక్షణమే తొలగించాలని లేదా వాటికి ప్రాప్యతను నిలిపివేయాలని మీకు ఇందుమూలంగా ఆదేశిస్తున్నాము. అదే సమయంలో, సాక్ష్యాల కోసం సంబంధిత డేటా, లాగ్‌లు, చందాదారుల సమాచారం భద్రపరచబడేలా చూడాలి,” అని ఆ నోటీసులో పేర్కొన్నారు. 
దీనికి సమాంతరంగా, ఐటీ చట్టం నిబంధనలు, ‘ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్, 2021’ ప్రకారం, గుర్తించిన కొన్ని యుఆర్ఎల్ లకు యాక్సెస్‌ను నిలిపివేయాలని ‘ఎక్స్’ సంస్థను ఆదేశిస్తూ ఐఎఫ్ఎస్ఓ నోటీసులు జారీ చేసింది. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు మొదట 15 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందేమోనని వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో ప్రధాని వీడియోను తొలగించడంపై మెటా సంజాయిషీ 

మరోవంక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతా నుండి పోస్ట్ చేసిన ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు నిరోధించిన కొన్ని రోజుల తర్వాత, ఆయన పోస్టులకు భద్రతా ఏర్పాట్లు చేస్తామని మెటా బృందం ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ పోస్టులకు పెంచిన భద్రతా చర్యలను వివరిస్తూ, ప్రముఖ ఖాతాలపై అదనపు పర్యవేక్షణ ఉంటుందని మెటా పేర్కొంది. 

ఇకపై, అటువంటి పోస్టులను మెటా సీనియర్ అధికారులు మాత్రమే పరిశీలిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. మంత్రిత్వ శాఖకు ఆ ప్లాట్‌ఫామ్ పంపిన తాజా సమాచారాన్ని ఉటంకిస్తూ, ఏ నిర్ణయమైనా కంపెనీకి చెందిన కనీసం ఇద్దరు సీనియర్ అధికారులచే కఠినమైన తనిఖీలు, సమీక్షకు గురవుతుందని తెలిపాయి. ఈ వారం చివర్లో మెటా బృందం ప్రభుత్వాన్ని కలవనుందని, ఈ సమావేశంలో కంటెంట్ నియంత్రణతో సహా ఇతర కీలక అంశాలపై కూడా చర్చిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. 

సిజెపి నేతృత్వంలో జరిగిన విద్యార్థి నిరసనల మధ్య జూలై 23న అప్‌లోడ్ చేసిన, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని జెన్ జెడ్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం ఉన్న వీడియోను కొద్దిసేపు నిరోధించారు. మెటా ఈ విషయాన్ని ఒక సాంకేతిక లోపంగా పేర్కొనడంతో, ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్‌ను పిలిపించింది. కంపెనీ ఇచ్చిన వివరణ సరిపోదని తాము భావిస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.